నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈప్రాజెక్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేతులమీదుగా ప్రారంభం కానుంది.
12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుని దర్శించుకునేందుకు భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభం కోసం ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీ జగన్నాథ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు కారిడార్లో భాగంగా శ్రీజగన్నాథ్ బల్లవ్ పార్కింగ్ ప్రదేశం, శ్రీసేతు పేరుతో వారధి నిర్మాణం, పుణ్యక్షేత్రాల కేంద్రాలు, పూరీ క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల రాకపోకల కోసం శ్రీమార్గ్ పేరుతో నూతన రహదారి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. వీటితోపాటు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం, భక్తులు సామాన్లను భద్రపర్చుకునేందుకు క్లాక్ రూములు, జగన్నాథ ఆలయంలోపలా, పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ఎన్నో సదుపాయాలను కూడా కల్పించారు.

రూ.800కోట్లు వ్యయాన్ని ఖర్చు పెట్టారు..
ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనుల కోసం 800కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ ఆలయాన్ని మేఘనాథ పచేరిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం వెలుపలిగోడ చుట్టూ విశాలమైన కారిడార్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 90 పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతినాడు మహాయజ్ఞం ప్రారంభమైంది.
ఈ మధ్యాహ్నం గజపతి మహారాజు దివ్యసింఘ దేవ్ నిర్వహించే పూర్ణాహుతితో మహాయజ్ఞం పూర్తికానుంది. అనంతరం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును భక్తులకు అంకితం చేయడం జరుగుతుంది. ఇందుకోసం 2400 పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వందమంది పర్యవేక్షణాధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ASI భద్రతావిధుల్లో ఉంటారని ఒడిశా ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి.



Click it and Unblock the Notifications













