సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త హంగులు దిద్దుకోబోతోంది. రూ.700 కోట్ల ఖర్చుతో అధునాతన సౌకర్యాలతో ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్ జాబితాలో చేరబోతోంది. మొత్తం ఎయిర్పోర్ట్ తరహాలో భద్రతా వ్యవస్థతోపాటు ఆధునిక సౌకర్యాలను రైల్వేస్టేషన్లో కల్పించనున్నారు. మొత్తంగా రానున్న ఏడాదిన్నర కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రైల్వేశాఖ తాజా ప్రణాళికలో భాగంగా ఈ స్టేషన్లో రాబోతోన్న కీలక మార్పులను ఒక్కసారి పరిశీలిద్దాం!
నిత్యం ప్రయాణికులతో రద్దీగా కనిపించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పటికప్పుడు సరికొత్తగా రూపాంతరం చెందుతూ వస్తోంది. అయితే, తాజాగా కేంద్ర రైల్వేశాఖ ఈ స్టేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ స్టేషన్లో ఎయిర్పోర్ట్ తరహా సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధమైంది. తాజా మార్పుల్లో కొన్ని అంశాలను చూస్తే.. సికింద్రాబాద్ స్టేషన్కు ఒకటో నెంబర్ ప్లాట్ఫాం వైపు అలాగే, పదో నెంబర్ ప్లాట్ఫాం ఉన్న బోయిగూడ వైపు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఆధునికీకరణ తర్వాత ఈ మార్గాల్లో ఒక్కోవైపు భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ఇక్కడ ప్రయాణికులు తమ లగేజీని స్క్రీనింగ్లో చెకింగ్ చేయించాల్సి ఉంటుంది. అలా అయిన తర్వాత మాత్రమే లోపలకు ప్రవేశం ఉంటుంది. ఈ తరహా నిర్భంత ప్రక్రియ కేవలం విమానాశ్రయాల్లోనే ఉంది. ఈ కారణంగా ప్రయాణికులు స్టేషన్కు కాస్త ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.

వెయిటింగ్ హాల్లోకి వెళ్లాల్సిందే..
సాధారణంగా టికెట్ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ఫ్లాట్ఫాం మీదకు చేరుకుంటారు. అయితే, సికింద్రాబాద్ స్టేషన్లో రానున్న రోజుల్లో అలా కుదరదు. టికెట్ తీసుకున్న తర్వాత నేరుగా వెయిటింగ్ హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. రైలు రావటానికి 15 నిమిషాల ముందు అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఫ్లాట్ఫాం మీదకు అనుమతిస్తారు. అయితే, మిగిలిన సమయలో స్టేషన్ లోపల ఉండే మాల్స్ వద్ద షాపింగ్ చేసుకోవచ్చు.
అయితే, గతంలో మాదిరిగా సరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్ఫామ్ మీదకు వెళ్లడం కుదరదన్న మాట. స్టేషన్కు వచ్చే ప్రయాణికులు కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ తర్వాత లోపలకు రావడంతోపాటు అనౌన్స్మెంట్ సమయానికి చేరుకోవాలి. లేదంటే వచ్చిన దారిలోనే వెనుదిగక తప్పదు. ఇది కూడా ఇప్పటి వరకూ కేవలం ఎయిర్పోర్ట్లలో మాత్రమే అమలులో ఉంది. అధునికీకరణ తర్వాత సికింద్రబాద్ రైల్వే స్టేషన్లోనూ అమల్లోకి వస్తుంది.

ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మాత్రమే..
దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి. అవి ఏపీ పరిధిలోని తిరుపతి, నెల్లూరు అలాగే, తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు. జోన్ వ్యాప్తంగా చూస్తే.. మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్భారత్ స్టేషన్లుగా ఉన్న భవనాలను మెరుగుపరచి, అభివృద్ధి చేయనున్నారు.
అయితే, ఒక్క సికింద్రాబాద్లోనే మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించనున్నారు. అలాగే, ఇదే తరహాలో అన్ని అమృత్భారత్ స్టేషన్లలోనూ చేయాలా? వద్దా? అన్న విషయపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ తరహా మార్పులు సాధారణ ప్రయాణికులు ఎలా ఉపయోగపడతాయో చూడాల్సిందే!



Click it and Unblock the Notifications












