ప్రకృతి అందాలతోపాటు చారిత్రక నిర్మాణాలను, సందర్శనీయ ప్రదేశాలను చూసేందుకు ఇదే మంచి అవకాశం. ఇలా కొత్త ప్రదేశాల్లో విహరిస్తూ.. గడిపే జ్ఞాపకాలు జీవితాంతం పదిలంగా ఉండిపోతాయి. అలాంటి క్షణాలను ఆస్వాదించాలనుకునేవారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగుపెట్టాల్సిందే. ఇక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు మీ మససును కట్టిపడేస్తాయి.
పురాతన సూర్యదేవాలయం..
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్థావన వస్తే మాత్రం.. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన సూర్యదేవాలయం గురించి తెలుసుకోవాల్సిందే. జైనథ్ మండలంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జైనులు నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తలు ఇక్కడికి చేరుకుంటారు. ఆదిలాబాద్ నుంచి ఈ ఆలయం 30 కి.మీ. దూరంలో ఉంది.
కుంటాల జలపాతం..
ఏటా ఈ సీజన్ వచ్చిందంటే నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలవుతుంది. దీనిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల విస్తరించి ఉన్న పచ్చని అడవి అందాలు, ఆ అటవీమార్గం గుండా జలపాతానికి చేరుకోవడం గొప్ప అనుభూతిని అందిస్తాయి.

కుమురంభీం స్మారక మ్యూజియం..
ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కుమురంభీం స్మారక మ్యూజియం తప్పక చూడదగిన సందర్శనీయ ప్రదేశం. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం రాజులపై తిరగడి, పోరాడి తన ప్రాణాన్నే త్యాగం చేసిన విప్లవయోధుడు కుమురంభీం పోరాట విశేషాలను ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడికి దగ్గరలో ఉన్న కెరమెరి ఘాట్ మార్గాన్ని కూడా సందర్శించవచ్చు.
నిర్మల్ కొయ్యబొమ్మలు..
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకునే అత్యంత పేరుపొందిన కొయ్యబొమ్మలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఎంతో తేలికపాటి పొనికి కలపతో 400 సంవత్సరాల నుంచి తయారు చేసే ఈ కొయ్యబొమ్మలు.. సజీవ కళకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. వీటి సందర్శనకు వచ్చేవారు అక్కడి నుంచి 15 కి.మీ. దూరంలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ జలాశయాన్ని వీక్షించవచ్చు.
సందర్శనీయం.. సరస్వతి క్షేత్రం..
ముథోల్ మండలంలోని బాసరలో కొలువై ఉన్న చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరి నదీ తీరంలో వెలసిన ఈ దేవాలయంలో అక్షరాభాస్యం చేయించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు.

సిరులు కురిపించే సింగరేణి..
శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఇందారం, బొగ్గు గనులు మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 10 కి.మీ. నుంచి 30కిలో మీటర్ల పరిధిలోనే ఉన్నాయి. భూగర్భం నుంచి ఖనిజాలు వెలికితీసే ప్రక్రియ నుంచి వాటిని రవాణా చేసే వరకు వివిధ దశలు, కార్మికుల శ్రమను దగ్గరగా చూసేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదిగా చెప్పొచ్చు.

సత్యదేవుని ఆలయం..
గోదావరి తీరంలో దండేపల్లి మండలం గూడెం సమీపంలో ఉన్న ఏకైక సత్యదేవుని ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇది జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన మారుమోగేలా ఈ ఆలయానికి సమీపంలోనే సాయిబాబా, అయ్యప్ప ఆలయాలు కునువిందు చేస్తాయి.



Click it and Unblock the Notifications












