Search
  • Follow NativePlanet
Share
» »ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం.. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఈ గంధర్వమహల్‌..

ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం.. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఈ గంధర్వమహల్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు ఎన్నో ప్ర‌దేశాలున్నాయి. వీటిలో పురాత‌న క‌ట్ట‌డాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే, ఇటీవ‌లే వందేళ్లు పూర్తి చేసుకున్న అతిపురాత‌న‌మైన క‌ట్ట‌డం గురించి మీరు విన్నారా..? ఆ క‌ట్ట‌డం మ‌రెక్క‌డో లేదండి ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో వెల‌సింది. ఈ క‌ట్ట‌డం ప్ర‌స్తుతం ఆనాటి చ‌రిత్ర‌కు స‌జీవ సాక్ష్యంగా నిలుస్తోంది. రండి ఆ క‌ట్ట‌డం గురించి తెలుసుకుందాం..

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది ఈ క‌ట్ట‌డం. దాని పేరే గంధర్వ మహల్‌. ఏపీలోని ఈ ప్రాంతానికి వెళ్లిన‌వారు ఈ మ‌హ‌ల్ చూడకుండా వెనక్కి రాలేరు. ఎందుకంటే, అంత‌టి అద్భుత క‌ట్ట‌డం ఈ మ‌హ‌ల్‌.. ఇటీవ‌లే ఈ నిర్మాణం వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ మ‌హ‌ల్ సుమారు నాలుగు అంతస్థులు, పాతిక గదులతో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఆ భవనం నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు అవుతున్న‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. అయినా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుత సౌంద‌ర్యంతో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ నిర్మాణం కళ్ళు చెందిరే డిజైన్‎లు, విదేశీ వస్తువులతో రాజసం ఉట్టిప‌డుతోంది.

మ‌హాల్ చ‌రిత్ర‌...

పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్వపు రోజుల్లో రెండే రెండు కుటుంబాల వారు అప్ప‌టి ప్ర‌భుత్వాలకు ఆదాయపన్ను చెల్లించే వారట. అందులో ఒకటి ఏలూరుకు చెందిన మోతి జమీందార్‌ కుటుంబమ‌యితే, రెండోది ఆచంటకు చెందిన గొడవర్తి కుటుంబం. గొడ‌వ‌ర్తి కుటుంబానికి చెందిన యువకుడు గొడవర్తి నాగేశ్వరరావు 1916లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆనాటి రాజసం ఉట్టిపడేలా ఓ అద్భుత భవనం నిర్మించాలని అనుకున్నాడు.

This Gandharva Mahal in West Godavari
Photo Credit: https://media.andhrajyothy.com/media/2024/20240707/18tpg1_82987d68ca_v_gif.webp

అందుకు అనుగుణంగానే దీని కోసం ఆ యువ‌కుడు రాజస్థాన్‌ వెళ్లి మ‌రీ అక్కడి కోటలను, కట్టడాలను పరిశీలించారట‌. ఆ త‌ర్వాత ఆచంటలో 1918లో గంధర్వ మహల్‌ నిర్మాణాన్ని ప్రారంభించార‌ట‌. ఈ మ‌హాల్ నిర్మాణం 1924 నాటికి పూర్తి అయ్యింది. ఈ ఏడాది (2024) కి ఈ మ‌హాల్ వయస్సు వందేళ్లు. నాటి జమీందారి వ్యవస్థ వైభవానికి ప్రతీకగా నిలిచింది రాష్ట్రంలోని ఈ గంధర్వ మహల్‌.

విదేశాల వ‌స్తువుల‌తో..

ఇక‌, ఈ మ‌హ‌ల్ నిర్మాణం కోసం బర్మా నుంచి శ్రేష్ఠమైన టేకు, కలపను తెప్పించారు. అలాగే, బెల్జియం నుంచి నాణ్యమైన అద్దాలను కూడా తీసుకొచ్చార‌ట‌. వీటితోపాటు లండన్‌ నుంచి తెప్పించిన బలమైన ఇనుప గడ్డర్‌లు కూడా ఈ నిర్మాణంలో వాడిన‌ట్లు తెలుస్తోంది. అస్స‌లు క‌రెంటు స‌దుపాయం లేని ఆ రోజుల్లోనే జనరేటర్‌ ఏర్పాటు చేసుకుని మ‌రీ, విదేశీ విద్యుత్‌ దీపాలతో ఈ మ‌హ‌ల్‌ను అలంకరించేవార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ నిర్మాణంలోని క‌ళా నైపుణ్యం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

వందేళ్లు పూర్తిచేసుకున్న ఈ మ‌హాల్ నేటికీ చెక్కు చెదరలేదంటే న‌మ్మండి. ఇక‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హాయాంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చాలామంది ఈ మ‌హాల్‌లో గ‌డిపారు. మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టీ రామారావు, చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు ఈ భవనంలో ఆతిథ్యం స్వీకరించిన‌ట్లు స‌మాచారం. ఇక‌, ఈ మ‌హాల్ మైసూర్ మ‌హారాజ్ ప్యాలెస్‌ను త‌ల‌పిస్తోంద‌ని చాలామంది అన్నారు.

నాలుగు అంతస్థుల్లో 25 గదులు...

గంధర్వ మహల్‌కు 1969, 2009లలో ఒక‌సారి మెరుగులు దిద్దిన‌ట్లు తెలుస్తోంది. ఈ మహల్‌లోని నాలుగు అంతస్థుల్లో 25 గదులు ఉన్నాయి. సుమారు 50 సెంట్ల భూమిలో ఈ మ‌హాల్‌ను నిర్మించారు. ఈ మహల్‌ సెంట్రల్‌హాల్‌లో ఓ పియానో క‌నిపిస్తుంది. ఇది ఈ కట్టడానికి అదనపు ఆకర్షణ అని చెప్పుకోవాలి. గొడవర్తి కుటుంబంలోని సంగీత ప్రియులు ఈ పియానోను లండన్‌ నుంచి తెప్పించారని స్థానికులు చెబుతున్నారు. ఈ పియానో అనేక ప‌త‌కాల‌ను కూడా సొంతం చేసుకుంది. 1885లో లండన్‌లో నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్‌ పోటీలలో ఈ పియానో రజత పతకం గెల్చుకుంద‌ట‌.. మ‌రీ ఇంత‌టి చరిత్ర క‌లిగిన ఈ మ‌హాల్‌ను త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే..

More News

Read more about: gandharva mahal west godavari
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+