బీహార్లో వెయ్యేళ్ల కాలం నాటి పురాతన దుర్గామాత ఆలయం...
భారతదేశం పురాతన ఆలయాలకు, కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. వీటిని సందర్శించేందుకు సుదూర ప్రాంతాలను నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. భారతదేశంలోని కొన్ని దేవాలయాలు శతాబ్దాల కాలంలో నిర్మించినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం దసరా వేడుకలు జరుగుతున్నాయి. ఈ దసరా సందర్భంగా ఎన్నో దుర్గామాత ఆలయాలను, ఎన్నో ప్రసిద్ధకట్టాడాలను సందర్శించి ఉంటారు. అయితే, బీహార్లో ఉన్న వెయ్యేళ్ల కాలం నాటి పురాతన దుర్గామాత ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా.. అయితే రండి ఈ దసరాకు ఈ దుర్గమాత ఆలయాన్ని సందర్శించుకుందాం.
పురాతన చరిత్ర కలిగిన ఆలయం...
ఈ దుర్గమాతా ఆలయం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం.. బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ముండేశ్వరి అనే దుర్గామాత ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధగాంచింది. దీనిని ముండేశ్వరి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. వారణాసికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.

క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం..
ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుని విగ్రహాన్ని ఏడో శతాబ్దంలో పెట్టారని తెలుస్తోంది. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడినాయి. భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో దీనిని ప్రథమంగా పరిగణించవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం కూడా ఇదే.
ఈ ఆలయం ముండేశ్వరీ అనే పర్వతం మీద వుంటుంది. ఈ పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ముండేశ్వరి ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలోని దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. ఈ ఆలయాన్ని100ఏడి లో నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భక్తులకు వరాహి మాతగా దర్శనం కల్పిస్తారు.

పది చేతులతో ఉన్న అమ్మవారు..
ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ శివుడు కూడా నాలుగు ముఖాలను కలిగి ఉంటాడు. రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగివుంటాయి. భక్తులు ఎక్కువ ఈ ఆలయాన్ని సందర్శించటానికి చైత్రమాసంలో అధికసంఖ్యలో వస్తూ వుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
అంతేకాకుండా ఈ దేవాలయములో నాలుగు ముఖాలు కలిగిన శివుడు, విష్ణుభగవానుడు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే సాత్విక బలి ప్రత్యేక విశేషత అని చెప్పుకోవాలి. ఇక్కడ మొదటగా బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. ఆ తర్వాత పూజారి మంత్రించిన అక్షింతలను ఆ మేకపై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహతప్పి పడిపోతుంది. మరోసారి పూజారి ఆ అక్షింతలను మేకపై వేస్తాడు. దీంతో ఆ మేక మళ్లీ యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది.



Click it and Unblock the Notifications












