పంజాబ్ లోని అమృత్ సర్ లో కల స్వర్ణ దేవాలయం భారత దేశపు ప్రసిద్ధ టెంపుల్స్ లో ఒకటి. అమ్రిత్ సర్ దేవాలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం. ఈ టెంపుల్ ను శ్రీ హర మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కు స్వర్ణ దేవాలయం అని పేరు ఎందుకు వచ్చింది ? అంటే, గురుద్వారాగా పిలువా బడే ఈ సిక్కుల పుణ్య క్షేత్రపు పై అంతస్తులను సుమారు 400 కే.జి. ల బంగారంతో నిర్మించటం చే ఈ దేవాలయానికి స్వర్ణ దేవాలయం అనే పేరు వచ్చింది.
దేవాలయం క్లుప్త చరిత్ర
ఇక్కడ కల ఒక పెద్ద సరస్సు ను అమృత్ సరోవర్ అని అంటారు. ఇది ఒక మానవ నిర్మిత సరస్సు. సిక్కుల నాల్గవ గురువు అయిన గురు రాం దాస్ జి ఆధ్వర్యం లో దీనిని నిర్మించారు. ఈ సరస్సు నిర్మాణం సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఒక దశాబ్దం తర్వాత, 1588 సంవత్సరం లో, సిక్కుల అయిదవ గురువు అర్జున్ దేవ్ జి గోల్డెన్ టెంపుల్ నిర్మాణం చేసారు.
గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఈ టెంపుల్ సిక్కు మతస్తుల పుణ్య క్షేత్రం గా ప్రసిద్ధి చెందినది. అమృత్ సరోవర్ సరస్సులో స్నానం ఆచరిస్తే, చేసిన పాపాలు తొలగిపోతాయని, మోక్షం వస్తుందని ఈ మతస్తులు భావిస్తారు.
దేవాలయ శిల్ప శైలి
గోల్డెన్ టెంపుల్ అమృత్ సరోవర్ అనబడే పవిత్ర సరస్సు మధ్యలో వుంటుంది. ఈ నిర్మాణాన్ని ఒక ఎత్తైన ప్లాట్ ఫారం పై నిర్మించారు. ఈ ప్లాట్ ఫారం అందంగా పూవులు, లతలతో చెక్కబడి వుంటుంది. టెంపుల్ గోపురం అనేక చిన్న చిన్న గోపురాలు కలిగి వుంటుంది. ఈ గోపురాలు కూడా బంగారు పూతలు వేయబడ్డాయి. ఈ గోపురం దూరానికి కూడా మెరుపులతో మెరుస్తూ కనపడుతుంది. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం కుల, మత, లింగ వివక్షత లేకుండా ప్రజలందరినీ తమ టెంపుల్ దర్శనానికి స్వాగతిస్తుంది.
వాతావరణం మరియు రవాణా సదుపాయం
వేసవి నెలలు అయిన మే నుండి జూన్ వరకు గల నెలలు ఈ టెంపుల్ సందర్శనకు సరైనవి కావు. ఎంతో వేడిగా వుంటుంది. ఇక్కడ వర్ష రుతువు జూలై నుండి ఆగష్టు వరకూ వుంటుంది. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం ఆహ్లాక్దకరంగా వుండి పర్యటనకు అనుకూలంగా వుంటుంది. అమృత్ సర్ ప్రదేశాన్ని దేశంలోని ప్రధాన ప్రదేశాలనుండి తేలికగా చేరవచ్చు. అమృత్ సర్ కు రోడ్డు, రైలు, వాయు మార్గాలు కలవు. దేశంలోని మెట్రో నగరాలతో చక్కని రవాణా సదుపాయం కలిగి వుంది. ప్రపంచ పర్యాటక ప్రదేశాలలో ఒక ప్రధాన పర్యాటక స్థలంగా పేరు గాంచినది. ఈ ప్రదేశంలో ఒక్క గోల్డెన్ టెంపుల్ మాత్రమే కాక, పర్యాటకులు చూసేందుకు అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. టెంపుల్ కు సమీపంలో మరికొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు వాగా బోర్డర్. మందిర్ మాతా లాల్ దేవి, శ్రీ ఆకల తఖ్త్, మరియు దుర్గానియా టెంపుల్ . పర్యాటకులు వీటిని కూడా చూసి ఆనందించి తమ పర్యటనకు అధిక లాభం చేకూర్చవచ్చు.