అద్భుతమైన శిల్పకళకు ఉదాహరణ.. కోణార్క్ సూర్య దేవాలయం..
భారతదేశంలో అనేక గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇవి వివిధ దేవుళ్ళకు, దేవతలకు అంకితం చేయబడ్డాయి. అటువంటి ప్రత్యేక దేవాలయం ఒడిశాలో ఉంది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. జి-20 సదస్సు ప్రతినిధులకు స్వాగతం పలికే సమయంలో భారత్ మండపంలో బ్యాక్గ్రౌండ్లో పెద్ద చక్రాన్ని ఏర్పాటు చేయడంతో చాలామందికి దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. ఈ చక్రం ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయపు కోణార్క్ చక్రం యొక్క ప్రతిరూపం. కోణార్క్ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని పద్మ ఖేత్ర అని కూడా అంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా చేర్చబడింది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక విషయాల గురించి తెలుకుందాం.

సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం
కోణార్క్ ఒడిశాలోని గోల్డెన్ ట్రయాంగిల్లో ఓ భాగం. ఇందులో భువనేశ్వర్, పూరి కూడా ఉన్నాయి. దీనిని క్రీ.శ.1250లో రాజు నరసింహదేవ్ నిర్మించారు. ఈ ఆలయ వైభవం ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటుంది. ఈ ఆలయం 12 జతల చక్రాలు, ఏడు గుర్రాలు లాగుతున్న సూర్య భగవానుడి రథంలా కనిపిస్తుంది. కోణార్క్ వీల్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది సన్ డయల్లా పని చేస్తుంది.అంతేకాకుండా,ఇది ఖచ్చితమైన సమయాన్ని చూపుతుందని నమ్ముతారు. పన్నెండు చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తాయి. చక్రంలోని ఎనిమిది డయల్లు రోజులోని ఎనిమిది గంటలను సూచిస్తాయి. అందమైన కళాఖండాలతో అలంకరించబడిన ఈ ఆలయం వాస్తుశిల్పం, అద్భుతమైన శిల్పకళకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

ఇది ఆలయ ప్రత్యేకత
ఈ ఆలయ ప్రాంగణం డ్యాన్స్ పెవిలియన్, జగ్మోహన్గా విభజించబడింది. భద్రతా కారణాల దృష్ట్యా, ఆలయపు ప్రధాన భాగంలోకి ప్రవేశం నిషేధించబడింది. అంతేకాకుండా, ఇక్కడ అనేక ఇతర అంశాలను చూడొచ్చు. ఆలయ పక్కనే ఉన్న భాగాలలో పన్నెండు జతల చక్రాలు ఉన్నాయి. వాటిపై వేర్వేరు బొమ్మలు తయారు చేయబడ్డాయి. ప్రతి చక్రపు ఆకారానికి దాని సొంత ప్రాముఖ్యత దాగి ఉంది. అంతేకాకుండా, ఈ ఆలయ గోడలపై అనేక శృంగార శిల్పాలు ఉన్నాయి. దీంతో పాటు చారిత్రక కళాఖండాలను చూడగలిగే ఐదు గ్యాలరీలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఆడిటోరియంలో దేవాలయానికి సంబంధించిన చలనచిత్రం కూడా ప్రదర్శించబడుతుంది. సమీపంలో చంద్రభాగ్ బీచ్, అష్టరంగ్ బీచ్ కూడా ఉన్నాయి. బాలుఖండ్ కోణార్క్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది.

ఎలా చేరుకోవాలి
కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని పూరి జిల్లాలో ఉంది. ఇది ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పూరి చేరుకోవడానికి రైలు లేదా విమానాన్ని బుక్ చేసుకోవచ్చు. పూరి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు.
ఉత్తమ సమయం ఏది?
అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది.



Click it and Unblock the Notifications













