బెంగళూరు నుంచి వీకెండ్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! సెప్టెంబర్ 4, శుక్రవారం నుంచి నగరంలోని ఐదు కీలక ఫ్లైఓవర్లపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లను తగ్గించేందుకు పోలీసులు కొన్ని రకాల వాహనాల రాకపోకలపై పరిమితులు విధించారు. ఈ జాబితాలో బీజీఎస్ (BGS) ఫ్లైఓవర్, పీణ్యా ఎలివేటెడ్ కారిడార్లతో పాటు సిల్క్ బోర్డ్-రాగిగుడ్డ డబుల్ డెక్కర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్పై సెప్టెంబర్ 11 నుంచి ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్పై బైక్లు, ఆటోలను పూర్తిగా నిషేధించగా.. సరుకు రవాణా వాహనాలపై సమయాల ఆధారంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఏ ఫ్లైఓవర్పై ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఓసారి చూడండి: బీజీఎస్ ఫ్లైఓవర్పై భారీ సరుకు రవాణా వాహనాలపై రోజంతా నిషేధం ఉంటుంది. తేలికపాటి సరుకు రవాణా వాహనాలను ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించరు. పీణ్యా ఫ్లైఓవర్పై ప్యాసింజర్ ఆటోలు, త్రీ-వీలర్ సరుకు రవాణా ఆటోలను పూర్తిగా బ్యాన్ చేశారు. అలాగే ఉదయం 7-11, సాయంత్రం 4-10 పీక్ అవర్స్లో భారీ, మధ్యతరహా సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు ఉంటాయి. సిల్క్ బోర్డ్-రాగిగుడ్డ డబుల్ డెక్కర్పై హెవీ వెహికల్స్కు 24 గంటలూ అనుమతి లేదు. ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి నిరాకరించగా.. సరుకు రవాణా వాహనాల కదలికలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్పై కూడా సెప్టెంబర్ 11 నుంచి ఇవే తరహా నిబంధనలు వర్తిస్తాయి.

ఎయిర్పోర్ట్, మైసూర్-కూర్గ్, నంది హిల్స్ వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు.. బెస్ట్ టైమింగ్స్ ఇవే!
ఎయిర్పోర్ట్కు వెళ్తున్నారా? ఫ్లైఓవర్కు బదులుగా హెబ్బాల్, కొడిగేహళ్లి, జక్కూర్, యలహంక, హుణసమారనహళ్లి, దేవనహళ్లి మీదుగా వెళ్లే కింది NH44 రోడ్డును ఉపయోగించండి. రద్దీగా ఉండే సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణిస్తే ఒక 15 నుంచి 25 నిమిషాల సమయం అదనంగా పడుతుంది. ఇబ్బంది లేని ప్రయాణం కోసం కొన్ని బెస్ట్ టైమింగ్స్: శుక్రవారం రాత్రి 9:30 తర్వాత, శనివారం ఉదయం 8 గంటల కంటే ముందు, లేదా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరడం మంచిది. మార్గంలో వర్షం, పొగమంచు వివరాల కోసం ఐఎమ్డీ (IMD) రాడార్ను, రోడ్డుపై ట్రాఫిక్ అప్డేట్స్ కోసం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల (BTP) 'ASTraM' యాప్ను ఫాలో అవ్వండి. కార్లకు ఫ్లైఓవర్పై అనుమతి ఉన్నప్పటికీ, ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాల వేగం నెమ్మదించే అవకాశముంది.
క్యాబ్లు, బైక్ల కంటే బీఎంటీసీ 'వాయు వజ్ర' బస్సులే నయం!
ఈ ఆంక్షల సమయంలో క్యాబ్లు, బైక్ల కంటే ఎయిర్పోర్ట్ బస్సుల్లో ప్రయాణించడమే అత్యంత సురక్షితం, సౌకర్యవంతం. బీఎంటీసీ (BMTC) నడిపే ఏసీ 'వాయు వజ్ర' బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మెజెస్టిక్ నుంచి KIA-8 బస్సు ప్రతి 15-30 నిమిషాలకు ఒకటి నడుస్తుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్, వైట్ఫీల్డ్, కేంగేరి నుంచి కూడా ఈ సర్వీసులు ఉన్నాయి. రూట్ ఆధారంగా ఛార్జీలు ₹200 నుంచి ₹420 వరకు ఉంటాయి. లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలంతో పాటు సరైన సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి మైసూర్-కూర్గ్ వైపు వెళ్లే కుటుంబాలకు కేఎస్ఆర్టీసీ (KSRTC) నడిపే నాన్స్టాప్ 'ఫ్లైబస్' సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది.
రూట్ సూచనలు, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు!
ఈ వీకెండ్లో మైసూర్-కూర్గ్ వైపు వెళ్తున్నారా? కార్లలో వెళ్లేవారు యాక్సెస్-కంట్రోల్డ్ హైవేను ఉపయోగించవచ్చు. కానీ ద్విచక్ర వాహనాలకు ఈ ఎక్స్ప్రెస్వేపై అనుమతి లేదు, వారు ఖచ్చితంగా సర్వీస్ రోడ్డులోనే వెళ్లాలని చట్టం చెబుతోంది. కేంగేరి వద్ద ట్రాఫిక్ చిక్కులు తప్పించుకోవాలంటే ఉదయం 7 గంటలకు ముందే లేదా రాత్రి 9:30 తర్వాత ప్రయాణం ప్రారంభించండి. ఇక నంది హిల్స్ వెళ్లేవారు హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద ఉండే రద్దీని తప్పించుకోవడానికి హెణ్ణూరు-బాగలూరు-నంది క్రాస్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 177A కింద కనీసం ₹500 ఇ-చలానా విధిస్తారు. ఫ్లైఓవర్ ఎంట్రీల వద్ద కెమెరాలతో పాటు పోలీసు తనిఖీలు కూడా ఉంటాయి, జాగ్రత్త!



Click it and Unblock the Notifications











