కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిరసన ధర్నా నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 2) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్రీడమ్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో KSR బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్, మెజెస్టిక్ బస్టాండ్కు వెళ్లే దారుల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు మళ్లింపులు, పార్కింగ్ ఆంక్షలు ఉన్నందున రైలు ప్రయాణికులు ఒక 25 నుంచి 40 నిమిషాల సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫ్రీడమ్ పార్క్ జంక్షన్ నుంచి కనకదాస సర్కిల్ మధ్య వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. కేజీ రోడ్డు మీదుగా మైసూర్ బ్యాంక్ సర్కిల్ వైపు నుంచి వచ్చే వాహనాలు మహారాణి అండర్పాస్ గుండా ప్యాలెస్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఖోడే జంక్షన్ నుంచి కేఆర్ సర్కిల్ వైపు వెళ్లే ప్రయాణికులు పాత JD(S) ఆఫీస్ రోడ్డును ఉపయోగించాలి. గాంధీనగర్ వైపు వెళ్లే వాహనాల కోసం సుబ్బన్న జంక్షన్ నుంచి MTR జంక్షన్ వరకు ద్విమార్గ (టూ-వే) రాకపోకలకు అనుమతించారు. ఇక కేజీ రోడ్డు, ప్యాలెస్ రోడ్డు, కాళిదాస రోడ్డు, వై రామచంద్ర రోడ్డుతో పాటు ఖోడే-మహారాణి స్ట్రెచ్లో వాహనాల పార్కింగ్ను పూర్తిగా నిషేధించారు.

ఫ్రీడమ్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు: KSR/మెజెస్టిక్కు వెళ్లేందుకు సులువైన మార్గాలు ఇవే..
పీణ్యా లేదా యశ్వంతపూర్ వైపు నుంచి వచ్చేవారు శేషాద్రి రోడ్డుకు బదులుగా స్వస్తిక్-రేస్ కోర్స్ రోడ్డు మీదుగా స్టేషన్కు చేరుకోవచ్చు. వైట్ఫీల్డ్ లేదా బైయప్పనహళ్లి నుంచి వచ్చే ప్రయాణికులు పర్పుల్ లైన్ మెట్రో ఎక్కి, KSR మెట్రో స్టేషన్లోని 'ఎగ్జిట్ A' ద్వారా బయటకు రావాలి. ఈ ఎగ్జిట్ నుంచి నేరుగా ప్లాట్ఫామ్ 10కి కనెక్ట్ అయ్యేలా ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉంది. దీనివల్ల ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. ఇక దక్షిణ బెంగళూరు ప్రయాణికులు గ్రీన్ లైన్ మెట్రోలో మెజెస్టిక్ చేరుకుని, అక్కడ ఉన్న సూచికల ఆధారంగా వాక్వే ద్వారా స్టేషన్కు వెళ్లవచ్చు.
| ప్రయాణించే ప్రాంతం | ఉత్తమ మార్గం / మెట్రో ఎగ్జిట్ |
|---|---|
| పీణ్యా, యశ్వంతపూర్ | స్వస్తిక్ → రేస్ కోర్స్ రోడ్డు → KSR/మెజెస్టిక్ (శేషాద్రి రోడ్డు ఆంక్షల గుండా వెళ్లకుండా) |
| వైట్ఫీల్డ్, బైయప్పనహళ్లి | పర్పుల్ లైన్ → KSR మెట్రో ఎగ్జిట్ A → ప్లాట్ఫామ్-10కి ఫుట్బ్రిడ్జ్ |
| జయనగర్, జేపీ నగర్ | గ్రీన్ లైన్ → మెజెస్టిక్ → సూచికలతో ఉన్న వాక్వే ద్వారా SBCకి.. |
KSR బెంగళూరు: ప్లాట్ఫామ్ వివరాలు, పికప్ టిప్స్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
KSR స్టేషన్లో చాలా వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు ప్లాట్ఫామ్ 8 నుంచి 10 నుంచే బయలుదేరుతాయి. మెట్రో ఫుట్బ్రిడ్జ్ నేరుగా ప్లాట్ఫామ్ 10 వద్దకే చేరుస్తుంది కాబట్టి స్టేషన్ మొత్తం నడవాల్సిన తిప్పలు తగ్గుతాయి. ఆటోలు లేదా క్యాబ్లు రామని చెప్పకుండా ఉండేందుకు కెంపేగౌడ బస్టాండ్ వద్ద ఉన్న ప్రీపెయిడ్ ఆటో కౌంటర్లను ఉపయోగించండి లేదా నిర్దేశిత జోన్లలో క్యాబ్లను ముందే బుక్ చేసుకోండి. ఎవరినైనా పికప్ చేసుకోవడానికి గుబ్బి తొటదప్ప రోడ్డును ల్యాండ్మార్క్గా తెలియజేయండి. అలాగే ట్రాఫిక్ లూప్ల వల్ల ఆలస్యం కాకుండా కనీసం 10 నిమిషాల బఫర్ టైమ్ చేర్చుకోవడం మంచిది.
రైలు మిస్సయితే ఏం చేయాలి?: TDR దాఖలు, రీఫండ్, రీబుకింగ్ నిబంధనలు ఇవే..
ఒకవేళ మీ వద్ద కన్ఫర్మ్ అయిన ఇ-టికెట్ ఉండి, రైలు మిస్ అయితే.. రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందే క్యాన్సిల్ చేయడం లేదా టికెట్ డిపాజిట్ రసీదు (TDR) దాఖలు చేస్తే తప్ప రీఫండ్ రాదు. ఒకవేళ రైలు సేవల్లో అంతరాయం కలగడం వల్ల గానీ లేదా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నప్పుడు గానీ రీఫండ్ కావాలంటే రైలు బయలుదేరే సమయానికి ముందే TDR దాఖలు చేస్తే పూర్తి చార్జీలు తిరిగి వస్తాయి. ఇతర అర్హత కలిగిన సందర్భాల్లో 72 గంటల లోపు TDR దాఖలు చేయాల్సి ఉంటుంది. మరో టికెట్ రీబుక్ చేసుకునే ముందు NTES యాప్లో లేదా 139 నంబర్కు కాల్ చేసి రైలు రన్నింగ్ స్టేటస్ సరిచూసుకోండి.



Click it and Unblock the Notifications











