భారతదేశాన్ని ఒకప్పుడు ఎన్నో రాజ వంశాలు పాలించాయి. ఒక్కో రాజవంశం, ఒక్కో దేశం భారతదేశానికి రకరకాల ఆహార అలవాట్లను రుచి చూపించాయి. ముఖ్యంగా విదేశీ రాజులు, ప్రతినిధులు భారతదేశంలో పరిపాలన సాగించేటప్పుడు ఇవి లభ్యమయ్యేవి. మొదట వీటిని విదేశీయులు మాత్రమే భుజించేవారు. ఆతరువాత ఇవి దేశమంతటా విస్తరించాయి.
ఏ ఏ దేశాలు ఏమేమి తీసుకువచ్చాయి ?
మొట్టమొదటి సారిగా మన దేశాన్ని క్రీ.శ. 712 వ సంవత్సరంలో అరబ్బులు పాలించారు. ఆ తరువాత పర్షియన్లు .. మరికొంత కాలానికి మొఘలులు భారతదేశం లో పాలన కొనసాగించారు. వీరి కాలంలో ఇప్పటి ఫేమస్ డిష్ అయిన 'బిర్యాని' మొదటిసారిగా వాడుకలో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భారతీయలు బిర్యాని రుచి వదలలేదు. అంతెందుకు ఇప్పటికీ చాలా పెళ్ళిళ్ళ లో బిర్యానీ ఉండక మానదు !
క్రీ.శ. 1498 వ సంవత్సరంలో సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని కనుగొన్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా, భారతదేశానికి టమోటా ను పరిచయం చేసాడు. వెస్ట్ ఇండీస్ పచ్చిమిరపకాయలను మరియు చక్కెర ను తీసుకువచ్చింది.
భారతదేశానికి ఎన్ని దేశాలు ఎన్నెన్ని రుచులను పరిచయం చేసినప్పటికీ, బిర్యానీ అన్ని రుచులలో ప్రత్యేకమైంది. మనకు 'హైదరాబాదీ బిర్యానీ' రుచి ఒక్కటే తెలుసు కానీ ఇండియాలో ఎన్నో రాష్ట్రాల్లో బిర్యానీ టెస్ట్ ఒక్కో విధంగా, ఒక్కో రుచి తో ఉంటుంది.
ఇండియాలోని కొన్ని బెస్ట్ బిర్యానీ రుచులు !

తలప్పకట్టి బిర్యానీ
'తలప్పకట్టి బిర్యానీ' ని క్రీ.శ. 1957 వ సంవత్సరంలో ఆనంద విలాస్ హోటల్ యజమానైన నాగసామి నాయుడు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో మొదటి సారిగా ప్రారంభించారు. ఈ బిర్యానీ కి ఆ పేరు నాయుడు ధరించే తలపాగా (తమిళంలో 'తలప్ప') నుండి వచ్చింది. అప్పటి నుండి ఈ బిర్యానీ తలప్పకట్టి బిర్యానీ గా ప్రసిద్ధి చెందింది. అందుకే దిండిగల్ ను బిర్యానీ సిటీ అని పిలుస్తారు.
చిత్ర కృప : Food Drifter

తలాసేరి బిర్యానీ
తలాసేరి కేకులు, బేకరీ ల పుట్టినిల్లు. ఇక్కడ బిర్యానీ రుచి కూడా తప్పక అనుభవించాలి. ఇక్కడ తయారయ్యే బిర్యానీ మొఘల్ స్టైల్ ను పోలి ఉంటుంది. రైస్ లో ఖీమా మిక్స్ చేసి వడ్డిస్తారు. రుచి రావటానికి మసాలాలను, అల్లం వెల్లుల్లి పేస్ట్ లను మరియు సుగుంధ ద్రవ్యాలను వాడతారు. ఇది హైదరాబాద్ బిర్యానీ రుచిని తలపిస్తుంది.
చిత్ర కృప : rasheed00

అమ్బుర్ బిర్యానీ
'అమ్బుర్ బిర్యానీ' నవాబుల డిష్. దీనిని మొదటిసారి తమిళనాడు ప్రజలకు రుచి చూపించింది హస్సన్ బైగ్ కుమారుడు కుషిద్ బైగ్. హస్సన్ బైగ్ రాచకుటుంబీకులకు, నవాబులకు వంట చేసే చెఫ్. తండ్రి నుండి నేచుకున్న బిర్యానీని కుషిద్ సైకిల్ మీద ఎక్కి ఊరూరా అమ్మేవాడు. ఆతర్వాత ఇది తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విస్తరించింది. చెన్నై నుండి బెంగళూరు కు రోడ్డు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు రోడ్డు వెంబడి ఉన్న డాభా లు, హోటల్లు, రెస్టారెంట్ లలో లభించే అమ్బుర్ బిర్యానీ రుచి తప్పక తిని చూడాల్సిందే!
చిత్ర కృప : Cilantro2009

అవధి బిర్యానీ
అవధి బిర్యానీ లక్నోలో ప్రసిద్ధి చెందినది. ఇది మొఘలుల వంటకం. బిర్యానీ రెండు విధాలా దొరకుతుంది (చికెన్, మటన్ లలో). మటన్ తో చేసే బిర్యానీ చికెన్ కన్నా రుచికరంగా ఉంటుంది. మాంసం ముక్కలను, బాస్మతి రైస్ ను వేరువేరుగా ఉడికించి కలిపి వడ్డిస్తారు. అందులో షేర్వా, పెరుగు పచ్చడి కలుపుకొని తింటుంటే ... ఆ మజానే వేరు !
చిత్ర కృప : Pranaykuma12

కోల్కతా బిర్యానీ
'కోల్కతా బిర్యానీ' మిగితా అన్ని బిర్యానీ లతో పోలిస్తే కాస్త స్వీట్ గా ఉంటుంది. తయారు చేసే విధానం మాత్రం అవధి బిర్యానీ తరహాలోనే .. కానీ టెస్ట్ లోనే తేడా! మొఘల్ రాణి ముంతాజ్ బేగం (షాజహాన్ రెండవ భార్య) కు ఈ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమట.
చిత్ర కృప : Surajit Sengupta

హైదరాబాదీ బిర్యానీ
ప్రపంచంలో బిర్యానీ ఎక్కడ తిన్నా హైదరాబాద్ బిర్యానీ ని ఇట్టే పసిగట్టేస్తాం. రుచిలోనూ, ముక్క ఉడకడం లోనూ దానికదే సాటి. హైదరాబాద్ ను సందర్శించటానికి ఎంత పెద్ద వీవీఐపీ లు, వీఐపీ లు, ప్రముఖులు వచ్చినా బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు. ఇప్పటికీ క్రికెట్ దిగ్గజం సచిన్ హైదరాబాద్ కు వస్తే బిర్యానీ తప్పక రుచి చూస్తాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన బిర్యానీ గా 'హైదరాబాద్ దమ్ బిర్యానీ' గుర్తింపు తెచ్చుకుంది.
చిత్ర కృప : Bhaskaranaidu



Click it and Unblock the Notifications











