తెలంగాణ సరిహద్దు జిల్లాలు.. పర్యాటకుల విడిది కేంద్రాలు!
తెలంగాణ ప్రాంతంలో వేసవి విహారానికి ఇక్కడి పర్యాటక ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులలో దాగి ఉన్న సందర్శనీయ స్థలాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షస్తాయి. కుమురంభీం జిల్లా అటవీ అందాలు ప్రకృతి ప్రేమికులకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ప్రాంతాలన్ని ప్రాణహిత నది చుట్టుపక్కల ఉండడంతో పచ్చదనం పరచినట్లు దర్శనమిచ్చే ప్రకృతి అందాల విశేషాలను చూసొద్దాం రండి.

బామ్రాఘడ్.. వన్యప్రాణుల నిలయం
తెలంగాణ రాష్ట్రం కుమురంభీం జిల్లాను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలోని బామ్రాఘడ్ ప్రాంతం ప్రకృతి రమణీయతకు చిరునామాగా చెబుతారు. జిల్లాలోని సరిహద్దు మండలం చింతలమానెపల్లి నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్రాఘడ్లోని హెమల్కాస వద్ద సామాజిక సేవా కార్యకర్త బాబా ఆమ్టె ఆధ్వర్యంలో లోక్బిర్దారి ప్రకల్ప్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఇక్కడ గిరిజనులకు ఉచితంగా వైద్యం చేస్తారు. ఆస్పత్రి ఆవరణలో వన్యప్రాణుల సందర్శనశాల(జూ పార్కు) ఉంది.

చిరుత పులులు, ముళ్ల పందులు, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో రకాల అరుదైన జంతువులను చూడొచ్చు. బామ్రాఘడ్ సమీపంలో ఇంద్రావతి నది త్రివేణి సంగమం అరుదైనదిగా చెబుతుంటారు. ఇంద్రావతి, వాముల గౌతమి, వర్లకోట నదుల కలయికతో సంగమ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ప్రయాణంలో కనిపించే దృశ్యాలు, అటవీ అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటాయి. బామ్రాఘడ్ వెళ్లే మార్గంలో వచ్చే గ్లోరీ ఆఫ్ ఆల్లపల్లి చూడాల్సిన ప్రదేశం..
హాథీ క్యాంప్లో ఏనుగులతో ముచ్చట్లు..
చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. 10 వరకు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ స్థానిక అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఏనుగుల సంరక్షకుల సమక్షంలో సందర్శకులు నేరుగా పండ్లు, ఆహారం అందించవచ్చు. ఈ కేంద్రాన్ని స్థానికంగా హాథీ క్యాంప్ అని పిలుస్తారు. ఇక్కడి రిజర్వాయర్, అటవీ అందాలు, చల్లెవాడ రాబందుల సంరక్షణ కేంద్రం, ఏనుగు రూపంలో ఉన్న కొండ సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ప్రాణహిత జన్మస్థలంలో చెప్రాడ ప్రశాంత ధాం
కుమురంభీం, మంచిర్యాల జిల్లా వాసులకు చెప్రాడ ప్రశాంత ధాం ఆలయం సుపరిచిత ప్రదేశం. పెన్గంగా, వార్ధా నదుల సంగమ స్థలం ప్రాణహిత జన్మస్థలంలో ఈ దేవస్థానం ఉంది. చెప్రాడలో కార్తీక మహారాజ్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన ప్రశాంత ధాం హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది.
స్థానిక ప్రజలు మహారాజ్గా పిలుచుకునే కార్తీక్ స్వామి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారు. శ్రీకృష్ణ, రామ, శివ, దుర్గా, సాయిబాబా, గజానన్ మహరాజ్ ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన మరణానంతరం కూడా ఈ ప్రాంగణం సందర్శనీయ ప్రదేశంగా వెలుగొందుతోంది.
చెట్టుకాండంలో కొలువైన వేంకటేశ్వరుడు
కుమురంభీం, మంచిర్యాల, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో తోగ వెంకటాపూర్ ప్రాంతం ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ప్రజలు కొలిచే దేవస్థానాల్లో తోగ వెంకటాపూర్ ఒకటి. కాగజ్నగర్ నుంచి కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహెరి మీదుగా 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణిస్తే తోగ వెంకటాపూర్ చేరుకోవచ్చు. ఇక్కడ వేరుమద్ది చెట్టు కాండంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు.

800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అహెరి రాజ వంశీయులు తమ కుల దైవంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవస్థానం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. వేల సంవత్సరాల నాటి అరుదైన వృక్షాలు అబ్బుర పరుస్తాయి. చప్పట్లు కొడితే పైకి ఉబికే నీటి ఊటలు మనుషుల అలజడికే ఎగిసిపడే నీటి అలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications












