జటాయు నేచర్ పార్క్ అద్భుతాలను చూసేయండి!
కొన్ని మానవ నిర్మితాలు భారతీయ చారిత్రక వైభవానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. భారతీయ విస్వాసాలకు సాక్ష్యాలుగా కనువిందు చేస్తాయి. అలాంటి నిర్మాణమే జటాయు నేచర్ పార్క్. రెండు వందల అడుగుల పొడవు.. నూట యాభై అడుగుల వెడల్పు... డెబ్బై అడుగుల ఎత్తుతో దర్శనమిచ్చే ఇక్కడి పక్షి పరిమాణం దీనిని గిన్నిస్ బుక్లో చేర్చింది. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే ఈ ప్రయాణపు క్షణాలు మీ జీవితంలో మర్చిపోలేని ఎన్నో మధురానుభూతులను చేరువ చేస్తాయి.
కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఋ పార్క్ ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయు నేచర్ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. అతడు ఫిల్మ్ మేకర్ కూడా. నిజానికి, రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు.

గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్న నిర్మాణం
మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్ మ్యూజియం ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. కాంక్రీట్తో చేసిన ఈ నిర్మాణాన్ని స్టోన్ ఫినిషింగ్తో తయారు చేశారు. ఈ విగ్రహంలో రామాయణం గురించి చెప్పే ఆడియో-విజువల్ ఆధారిత డిజిటల్ మ్యూజియం ఎంతో ఆకర్షిస్తుంది. ప్రపంచంలో 'లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్' కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది.

చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతంగా..
రామాయణంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకు వెళుతున్నప్పుడు, జటాయు.. రావణుని ఎదుర్కొన్నాడని చెబుతారు. ఆ తర్వాత వారి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జటాయు పక్షి రావణుని చేతిలో హతమైన తరువాత ఇది చడయమంగళం పర్వత శిఖరంపై పడిందని చెబుతారు. సీతామాతను రక్షించడానికి జటాయు.. రావణుడితో ఎంతో పరాక్రమంతో పోరాడాడు. కానీ రావణుని నిలువరించలేకపోయాడు. చివరికి రావణుని చేతిలో హతమయ్యాడు. సీతామాత అపహరణ గురించి జటాయు.. రాముడికి తెలియజేసి, తుది శ్వాస విడిచిన ప్రదేశంగా పేరొందిన ఈ కొండపై ఈ విగ్రహం నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. అయితే, మనం ముందే చెప్పకున్నట్లు చారిత్రక అన్వేషణను పక్కడ పెడదాం. అప్పుడే ఇక్కడి ఆహ్లాదాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది.

జటాయు పార్కు సందర్శనలో పర్యాటకులు
ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. జటాయుపుర కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీసు నిత్యం అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












