దిల్లీ - వారణాసి మార్గంలో ఈ పండగ సీజన్లో వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ట్రయల్ రన్ నిర్వహించి, దీపావళి కానుకగా ఈ రైలును అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ భావిస్తోంది. రాత్రివేళ ప్రయాణించే ఈ రైలు ప్రయాగ్రాజ్, కాన్పూర్ మీదుగా న్యూదిల్లీ చేరుకోనుంది. అయితే, రైల్వే శాఖ టైమ్టేబుల్, రైలు నంబర్ను అధికారికంగా ప్రకటించే వరకు వీటిని ప్రతిపాదిత సమాచారంగానే పరిగణించాలి. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఈ రైలు వారణాసిలో ఆలస్యంగా రాత్రి బయలుదేరి, మరుసటి రోజు వేకువజామునే దిల్లీ చేరుకుంటుంది.
ఎందుకింత ప్రాధాన్యం?: దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఇప్పటికే హౌరా - కామాఖ్య మార్గంలో నడుస్తోంది. ప్రస్తుతం ఒక్క జత స్లీపర్ రైలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఒకవేళ ఆమోదం లభిస్తే.. దిల్లీ - వారణాసి మార్గంలో రానున్న రైలు దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ కారిడార్ కానుంది. ప్రతిపాదిత సమయాల ప్రకారం.. వారణాసిలో రాత్రి 9:20 గంటలకు బయలుదేరే ఈ రైలు, ఉదయం 5:00 గంటలకు దిల్లీ చేరుకుంటుంది. ఇది యూపీ - దిల్లీ మధ్య ప్రయాణించే భక్తులు, విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

దిల్లీ - వారణాసి వందే భారత్ స్లీపర్: ప్రతిపాదిత స్టాప్లు, టైమింగ్స్ ఇవే!
ఈ రైలు ప్రధానంగా నాలుగు స్టేషన్లలో ఆగనుంది. అవి: వారణాసి క్యాంట్, ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, న్యూదిల్లీ. తిరుగు ప్రయాణంలోనూ దాదాపు ఇదే తరహా సమయాలను నిర్ణయించారు. రాత్రివేళ ప్రయాణం కావడం వల్ల హోటల్ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఉదయానికే గమ్యస్థానానికి చేరుకుని పనులు ముగించుకోవచ్చు. అయితే శీతాకాలంలో మంచు ప్రభావంతో సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కనెక్టింగ్ ఫ్లైట్లు లేదా క్యాబ్లు బుక్ చేసుకునే వారు కాస్త సమయం వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. రీఫండ్ రాని బుకింగ్లు చేసుకునే ముందు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం శ్రేయస్కరం.
వందే భారత్ స్లీపర్ ఛార్జీలు, బుకింగ్ వివరాలు
రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం.. ఈ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన ఉంటాయి. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ రైళ్లలో RAC (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) సౌకర్యం ఉండదు. అలాగే కనీస ఛార్జీ విధించే దూరం 400 కిలోమీటర్లు. త్వరగా బుక్ చేసుకోవాలనుకునేవారు.. AC తరగతుల తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. IRCTC యాప్ నోటిఫికేషన్లు ఆన్ చేసుకుని, ప్రయాణికుల వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మేలు. అధికారిక సమాచారం వచ్చే వరకు సోషల్ మీడియాలోని ప్రచారాలను నమ్మకండి. పైగా వందే భారత్ సర్వీసులకు డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
సీట్ల ఎంపిక ఎలా ఉండాలి? ఎవరికి ఎక్కువ ఉపయోగం?
రాత్రి ప్రయాణంలో సరైన సీటు ఎంచుకోవడం చాలా ముఖ్యం. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్లు, ఒంటరిగా ప్రయాణించే వారికి ప్రైవసీ కోసం సైడ్ బెర్త్లు అనువుగా ఉంటాయి. బోగీ చివర్ల కంటే మధ్యలో ఉండే బెర్త్లలో ప్రయాణం హాయిగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే కుటుంబాలకు ఫస్ట్ ఏసీ క్యాబిన్లు మంచి ఆప్షన్, కాకపోతే ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక 3 ఏసీ విషయానికొస్తే.. డోర్ల దగ్గర ఉండే సీట్లను కాకుండా లోపల ఉండే బెర్త్లను ఎంచుకుంటే, స్టేషన్లు వచ్చినప్పుడు ప్రయాణికుల రాకపోకల వల్ల నిద్రకు భంగం వాటిల్లకుండా ఉంటుంది.
రైలు రన్నింగ్ స్టేటస్, ఇతర తాజా అప్డేట్ల కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) లేదా ఉత్తర రైల్వే అధికారిక ఖాతాలను చూడవచ్చు. అయోధ్య - కాశీ సందర్శించే భక్తులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఈ రాత్రివేళ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దిల్లీ వెళ్లే ప్రయాణికులు కూడా అదే రోజు కనెక్టింగ్ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. అయితే రైల్వే శాఖ అధికారికంగా టైమ్టేబుల్ విడుదల చేసి బుకింగ్స్ ప్రారంభించే వరకు ఈ షెడ్యూళ్లను తాత్కాలికమైనవిగానే పరిగణించాలి.



Click it and Unblock the Notifications