చాలామంది పర్యాటకులకు విదేశాలు సందర్శించాలని ఎంతో ఆశగా ఉంటుంది. కానీ, విదేశాలకు వెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పనే. వీటికంటే ముఖ్యంగా వీసా ఉండాలి. కానీ, వీసా అవసరం లేకుండా భారతీయులు పర్యటించేందుకు చాలా దేశాలు ముందుకు వచ్చాయి. ఆ జాబితాలో థాయ్లాండ్, వియత్నం, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. వాటితో పాటు మరో దేశం పేరు ఇప్పుడు తాజాగా వచ్చిందే. అదే మలేషియా. వీసా రహిత దేశాల్లో మలేషియా పేరు కూడా చేరిపోయింది.
ఇక, విదేశాలు సందర్శించాలనుకునేవారికి ఇక పండగే. తాజాగా వీసా లేకుండా తమ దేశంలోకి భారతీయులు రావొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పేర్కొనడం జరిగింది. ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ దేశంలో పెట్టుబడులు, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మట్లాడుతూ... దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చైనా, భారత్ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు. వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించిన తర్వాత 30 రోజుల పాటు ఇక్కడ ఉండొచ్చని ఆయన వివరించారు.
కానీ, వీసా సౌలభ్యం భద్రత ప్రకియకు మాత్రమే లోబడి ఉంటుందని ఆయన తెలిపారు. భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు చేస్తామని గత నెలలోనే మలేషియా దేశ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు.
మలేషియాతో పాటు మరికొన్ని వీసా రహిత దేశాలు...
మలేషియాతో పాటు భారతీయులు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని మరికొన్ని దేశాలు కూడా ప్రకటించాయి. అందులో థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం దేశాలు ఉన్నాయి. అయితే, ఇందులో నవంబర్ 10 నుంచి ఈ ప్రక్రియ థాయిలాండ్లో అమల్లోకి వచ్చింది. వచ్చే మే 10వరకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. అయితే, డిమాండ్ను బట్టి వీటిని కొనసాగించే అవకాశం ఉంటుందని థాయ్లాండ్ ప్రభుత్వం గతంలోనే వెల్లడించిన సంగతి విదితమే. మలేషియాలో ఆకర్షించే పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

మలేషియాలో కౌలాలంపూర్ ప్రధాన ఆకర్షణ..
మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుంటారు. కానీ అంతర్జాతీయంగా ఆర్ధిక మందగమనం కారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మలేషియా వంటి దేశాలను సందర్శించేందుకు ఎప్పుడూ ముందువరుసలో చైనా, భారత్ పౌరులే అధికంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు వారి సంఖ్యే క్రమంగా తగ్గుతోంది. అందుకే, ఈ రెండు దేశాల పౌరులకు మలేషియా ప్రభుత్వం వీసా రహిత ఎంట్రీ ఇచ్చి పర్యాటక ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యలో మలేషియాను సందర్శించేందుకు సుమారు 91 లక్షలమంది పర్యాటకులు వచ్చినట్లు మలేషియా ప్రభుత్వమే లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇందులో చైనా దేశంనుంచి 49 లక్షలమంది పర్యాటకులు రాగా, భారతదేశం నుంచి సుమారు 28 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు మలేషియా వీసా రహిత ఎంట్రీ అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications











