శ్రీరాముడు నడయాడిన నేలగా ప్రాచుర్యం పొందింది రామగిరి ఖిల్లా. అలనాటి చారిత్రక కట్టడాలకు నిలయం రామగిరిఖిల్లా. ఆయుర్వేద వనమూలికలకు ఈ ప్రాంతం పెట్టిందిపేరు. శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు ఎందరో చక్రవర్తుల పాలనకు నిదర్శనంగా నేటికీ ఠీవిగా నిలబడిన ఇక్కడి కోట నిర్మాణ శైలి ఎంతగానో ఆకట్టుకుంటుంది. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు తెలంగాణ రాష్ట్రంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి చరిత్ర ప్రేమికులు, ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే ఔత్సాహికులు ఇక్కడకు వస్తూ ఉంటారు.
తెలంగాణలోని పద్దపల్లి జిల్లాలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రామగిరి ఖిల్లా ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్ళే దారిలో కుడిపైపున రామగిరి మండలం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి బేగంపేట్, రత్నాపూర్ గ్రామాల మధ్య ఎతైనా విశాలమైన కొండలు ఉంటాయి. అక్కడ సుమారు మూడు కిలో మీటర్లు కాలినడకన ముందుకు వెళితే.. రామగిరి ఖిల్లాకు చేరుకోవచ్చు.
ప్రతి సంవత్సరం ఆగష్టు-సెప్టెంబర్ మాసాలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో రామగిరిఖిల్లా సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ సీజన్లో ఉదయం 8 గంటలకు ఖిల్లాకు చేరుకుంటే.. అక్కడి సందర్శనీయ ప్రదేశాలను పూర్తిగా చూసేందుకు సాయంత్రం అవుతుంది. అన్నీ చూడాలంటే, కోట లోపల భాగంలో సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.

25 మీటర్ల పొడవున్న ఫిరంగి..
మొత్తంగా రామగిరి ఖిల్లాపై ఏడు కోట ప్రవేశ ద్వారాలు కనిపిస్తాయి. అందులో మొదటి ద్వారానికి కుడివైపున వెళితే సముద్ర జలపాతం, రెండవ ద్వారం ప్రవేశంలో కుడివైపున గోడపైన క్రీ.శ 1556 నాటి పది పంక్తులలో గల తెలుగు శాసనం ఉంటుంది. ఈ శాసనంలో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి.. తుమ్మిఖాన్ అనే వ్యక్తి రెండవ ద్వారం నిర్మాణానికి 10 వేల రుపాయాల ఖర్చు అయినట్టు అట్టి ఖర్చును పన్నురూపంలో స్థానిక ప్రజలు చెల్లించవలెను... అని ఉంటుంది.
ద్వారం నుంచి లోపలకు ప్రవేశించిన తర్వాత ఎడమవైపున అధ్బుతమైన పచ్చని మైదానంలో 25 మీటర్ల పొడవు ఉన్న పెద్ద ఫిరంగి, నాల్గవ ద్వారంపై సృష్టి శిల్పాలతోపాటు, ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం, పిల్లల ఫిరంగీ, సుమారు 15 మీటర్ల పొడవు గల ఫిరంగీ(స్థానికులు పిల్లల ఫిరంగీగా పిలుస్తారు) వంటివి తారసపడతాయి.

కోటపైనుంచి చూస్తేనే అసలు మజా..
అయితే, ఇక్కడకి వచ్చే ప్రజల్లో మరో విస్వాసం కూడా ఉంది. ఇందులో నుంచి దూరితే సంతానంలేని వారికి సంతానం కలుగుతుందని, ఆనారోగ్యంతో బాధపడేవారు ఆయురారోగ్యాలతో జీవిస్తారని నమ్ముతారు. ఈ కారణంగా కూడా ఇక్కడికి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఆరవ ద్వారం గుండా 21 మెట్లు ఎక్కి కోటపైకి చేరుకోవడంతో అసలైన మజా ఉంటుంది.
అక్కడి నుంచి చూస్తే.. వయ్యారాలు పోయే మానేరువాగు.. ఖిల్లాపైన ఉన్న సీతమ్మ స్నానపు కొలను, పసరుబావులు, పసుపు కంకుమ భరణీ, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన రామలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, అశ్వశాలలు, నీటి సౌకర్యాన్ని రాజమందిరానికి తరలించిన రాతినీటిగొట్టాలు వంటి అనేక చారిత్రక నిర్మాణాలు చూడొచ్చు. ఈ జాబితాలోనే సీతారాముల దేవస్థానం కూడా చేర్చాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications











