అలంపూర్ క్షేత్రంలో అడుగడుగునా ఆకర్షించే నిర్మాణాలే!
తెలంగాణ రాష్ట్రం అటు.. పర్యాటక ప్రదేశాలతోపాటూ.. పురాతన ఆలయాలకూ పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఒకటో, రెండో చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. అలా రెండు నదులు పరవళ్లుతొక్కే చెట వెలసిన జోగులాంబ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
తెలంగాణ గద్వాల్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించే ప్రాంతంలో ఉంది జోగులాంబ ఆలయం. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలగలిసిన నేల ఇది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన అలంపూర్, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.

మరీ ముఖ్యంగా కృష్ణ - తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో బాదామి చాళుక్యులు నిర్మించిన అద్భుతమైన ఆలయాల సమాహారం జోగులాంబ శక్తి పీఠం. ఈ ప్రాచీన ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని అంటుంటారు. అంత అద్భుతమైన శిల్పకళ దీని సొంతం. ఏపీ నుంచి కర్నూలు మీదుగా ఎక్కువ మంది భక్తులు బస్సులలో ఇక్కడికి వచ్చి అలంపూర్ క్షేత్రాన్ని దర్శిస్తారు.
అద్భుత ఆలయ నిర్మాణ శైలి
తెలంగాణలోని పురాతన ఆలయాల్లో ఒకటైన ఇక్కడి ఆలయ గోపురాలు, స్తంభాలు, మంటపాలు, శిల్పాలు.. చాళుక్యుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. పూర్తిగా రాతినిర్మాణాలను అమర్చిన తీరు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దేశంలో ఉన్న నవబ్రహ్మా ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ప్రతీ ఆలయం చూడటానికి ఒకేలా ఉన్నా దేని ప్రత్యేకత దానిదే. వీటిలో ఒక్కటి కూడా మిస్సవకుండా చూడాలి. అంత చూడచక్కగా ఉంటాయి ఇవి. 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉన్న ఈ ఆలయం.. నిర్మాణ కాలంలో ఇంకెంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోవచ్చు.

13వ శతాబ్దంలో మొఘలులు, బహుమనీ సుల్తానులు దండయాత్ర చేసి.. ఆలయాన్ని నాశనం చేశారు. చాలా విగ్రహాల్ని విరగొట్టేశారు. విజయనగర చక్రవర్తి రెండో హరిహర రాయలు... బహుమనీ సైనికులను బలంగా అడ్డుకోవడంతో దాడులకు బ్రేక్ పడింది. ఆ సమయంలో భక్తులు.. జోగులాంబ, శక్తి నవ రూపాల మూల విరాట్టులను దగ్గరలోని నవబ్రహ్మ ఆలయానికి తరలించి దాచిపెట్టారు.
మరిన్ని పర్యాటక ప్రదేశాలు
దేశంలోని 18 శక్తి పీఠాల్లో ఒకటిగా అమ్మవారు దర్శనమిస్తున్న ఈ ఆలయానికి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటూ.. దేశంలోని చాలా ప్రాంతాలనుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మిక చింతన పలకరిస్తూనే ఉంటుంది అంటారు సందర్శకులు. చాలా వరకూ శిథిలావస్తలో ఉన్న ఈ ఆలయాలను చాళుక్యుల తర్వాత కాకతీయ రాజులు కూడా అభివృద్ధి కోసం కృషి చేశారు. కొన్ని ఆలయాల్ని మళ్లీ నిర్మించారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక్కడికి దగ్గరలో మరిన్ని చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, చందఘడ్ కోట, పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వరస్వామి దేవాలయం, జూరాల జలవిద్యుత్ కేంద్రం అన్నింటినీ కలిపి చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.



Click it and Unblock the Notifications












