అందాల నగరం విశాఖలో వేసే ప్రతి అడుగులో ఏదో తెలియని సంతోషం మనసును తాకుతుంది. అక్కడి తీరపు అందాలు.. ఎగసిపడే కెరటాలు.. మానసిక ప్రశాంతతను చేరువ చేస్తాయి. ఇక్కడి పర్యాటక అందాలను మరింత పెంచేందుకు.. సందర్శకులు కుటుంబ సమేతంగా కేరింతలు కొట్టేందుకు విశాఖ సువిశాలమైన సాగరతీరం అభివృద్ధి పనులపై విశాఖ టూరిజం శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను మరో పదిరోజుల్లో పర్యాటకుల కోసం సిద్ధం చేయనున్నట్లు చెబుతున్నారు పర్యాటకశాఖ అధికారులు.
ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు చూడాలంటే విశాఖ అందుకు కేంద్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పచ్చదనం కప్పేసుకున్న ఆహ్లదకరమైన విశాఖ వాతావరణంలో గడిపే ప్రతి క్షణం ఎన్నో తియ్యని అనుభూతులను అందిస్తాయి. రామకృష్ణా బీచ్, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి ఇలా చెప్పుకుంటు పోతే పర్యాటకులు సేదదీరేందుకు విశాఖ నగరం కేరాఫ్ అడ్రస్గా ఒప్పుకోక తప్పదు అనేంతలా ఈ లిస్ట్ ఉంటుంది మరి. తాజాగా ఈ జాబితాలోకి మరో కొత్త అతిథి రాబోతోంది. అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఎగసిపడే కెరటాలపై తేలియాడుతూ కడలి అందాలను దగ్గరగా చూడాలని ఆశపడేవారికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వారధిలా నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం..
విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డీఏ) ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే రెండు వారాల నుంచీ ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయని.. మరో పది రోజుల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వినియోగంలోకి వస్తే మాత్రం విశాఖ పర్యాటకానికి ఇదో స్పెషల్ టూరిజం ఎట్రాక్షన్గా నిలుస్తోంది అంటున్నారు విశాఖ వాసులు.
ఇది ఆర్కేబీచ్ నుంచీ పార్క్ హొటల్ మధ్యలో ఉన్న కోకో గార్డెన్స్ దగ్గరగా, కుర్సురా సబ్ మెరైన్ పక్కగా ఉండబోతోంది. కెరటాలపై తేలియాడే (ఫ్లోటింగ్) బ్రిడ్జి ఏర్పాటు మరో రెండు వారాల్లో అయిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్లాస్టిక్ బ్లాకులతో తీరం నుంచి సముద్రంలోకి అరకిలోమీటర్ మేరకు ఈ బ్రిడ్జి ఉంటుంది. అలలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై నిలబడితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమే.

సేఫ్టీ జాకెట్స్ తప్పనిసరి..
మొదట కెరటాల ఒడిదుడుకులు మధ్య మొదలై దాదాపు అలలు తాకిడి తగ్గే ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తర్వాత దీని ప్రవేశ రుసుంపై ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే పర్యాటకులకు అందుబాటులోనే ధర ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 150 రూపాయలు, పిల్లలకు 100 రూపాయలకు ప్రవేశం రుసుము ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్పైకి వెళ్లేవారికి సేఫ్టీ జాకెట్స్ తప్పనిసరి. వీటిని నిర్వాహకులు అందిస్తారు. ఇవి లేకుండా మాత్రం ఫ్లోటింగ్ బ్రిడ్జిపైకి అనుమతించే అవకాశం లేదని సమాచారం. మరి పైలట్ ప్రాజెక్ట్గా నగరంలో అడుగుపెడుతోన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్పైకి పర్యాటకుల ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



Click it and Unblock the Notifications












