విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద పొడవైన కాంటిలివర్ స్కైవాక్ గాజు వంతెన ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేరళ రాష్ట్రం వాగమోన్లోని వంతెన నమూనాగా దీనిని రూపొందించనున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) ఇటీవలే ప్రాజెక్ట్ కోసం ఒక ప్రైవేట్ భాగస్వామికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA)ని అందజేసింది. దీని అంచనా వ్యయం సుమారు రూ.5 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. విశాఖ తీరప్రాంతపు అందాలను మరింత దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.

అనుభవం ఉన్న ప్రైవేట్ భాగస్వామి..
ఈ ఒప్పందం ప్రకారం, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) స్కై-వాక్ బ్రిడ్జ్ టిక్కెట్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో ప్రైవేట్ భాగస్వామి నుంచి 40 శాతం వాటాను పొందుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎలాంటి ఖర్చులు పెట్టడంలేదు. కేవలసం కైలాసగిరి వద్ద దాదాపు 500 చదరపు గజాల స్థలాన్ని వంతెన బేస్ కోసం కేటాయించడం ద్వారా ఆదాయాన్ని పొందేలా ప్రణాళికలు వేశారు. నిజానికి, కాంటిలివర్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి అభివృద్ధి చేసే ప్రక్రియలోనే ఉంది. కేరళలో ఇలాంటి వంతెనను అభివృద్ధి చేసి, నిర్వహించడంలో అనుభవం ఉన్న ప్రైవేట్ భాగస్వామి స్థానిక డెవలపర్ మద్దతుతో బిడ్ను గెలుచుకున్నారు. భూసార పరీక్షలతో సహా సాంకేతిక పని ఇప్పటికే ప్రారంభించారు. అంతేకాదు, మార్చిలోనే ప్రారంభించేలా పెట్టుకున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల మూలంగా 15 ఏప్రిల్ 2024 నాటికి పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్ణయానికి వచ్చారు.

తాత్కాలిక టిక్కెట్ ధరలు ఇలా..
తీరానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న కైలాసగిరి సముద్రపు వ్యూపాయింట్తోపాటు లోయ యొక్క సుందరమైన దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తోంది. అందుకే, కైలాసగిరి ఇటువంటి ప్రాజెక్టులకు అనువైన ప్రదేశంగా గుర్తించబడింది. 2023 అక్టోబర్లో వాగమోన్ని సందర్శించి అక్కడి స్కైవాక్ వంతెనను అధ్యయనం చేసిన తరువాత, VMRDA కైలాసగిరి వద్ద ఇదే విధమైన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్ ప్రారంభంలో 100 మీటర్ల పొడవు వంతెనగా ప్రణాళిక వేసిప్పటికీ, పరిస్థితులు అనుకూలతను బట్టీ ఇందులో సర్దుబాట్లు చేయవచ్చు. వంతెనపైకి ఒకేసారి 15-20 మంది వ్యక్తులు ప్రవేశించవచ్చని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. అలాగే, 10-15 నిమిషాల నడక కోసం తాత్కాలిక టిక్కెట్ ధరలు రూ.100-రూ.300 వరకు ఉంటాయి.
ప్రతిపాదనలో మరిన్ని ప్రాజెక్ట్లు..
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. దీంతోపాటు కైలాసగిరి కోసం రాబోయే సంవత్సరానికి అనేక పర్యాటక ప్రాజెక్టులు ఇప్పటికే ప్రతిపాదించబడ్డాయి. వీటిలో నేచర్ కాటేజీలు, రెస్టారెంట్లు, బీచ్ వీక్షణతో కూడిన కేఫ్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కైలాసగిరి కొండల్లో డ్యాషింగ్ కార్ రేస్ ట్రాక్, 12డి థియేటర్, ఫ్లాష్ టవర్ కూడా ఉంటాయి ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న విశాఖ తీరం.. కైలాసగిరి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జితో మరింత పేరుపొందనుంది.



Click it and Unblock the Notifications












