దేశంలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో తెలంగాణలోని యాదగిరిగుట్ట ఒకటి. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం...ఏక శిఖరంపై అమ్మవారితో కలసి యాదాద్రీశుడు కొలువయ్యాడు. సుమారుగా మూడు వందల ఏళ్ల క్రితం 'వానమామలై జీయర్ స్వామి' పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రామానుజ సంప్రదాయాన్ని స్థిరపరిచాడని ఇక్కడికి వచ్చిన వారు చెబుతుంటారు. అప్పటి నుంచి ఇక్కడ యాదాద్రీశుడు కొలువై పూజలు అందుకుంటున్నాడు.
యాదాద్రికి వెళ్లేభక్తులకు ఆలయ అధికారులు ఓ శుభవార్తను తీసుకొచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుట్టకు వచ్చే భక్తులకు ఇప్పటికే పలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. ఇప్పడు మరో సేవ అందుబాటులోకి తీసుకురానున్నారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణ సేవను కూడా యాదాద్రిలో అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. అందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. యాదాద్రీశుని గిరి ప్రదక్షిణ సేవ జూన్ 18వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇక నుంచి అందరూ ఈ సేవ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
పునర్ నిర్మాణం అనంతరం..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం అనే ఆచారం ఎన్నో యేళ్ల నుంచి ఉన్నదే. అయితే, ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే ఇక్కడ గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకునేవారు. 2016లో యాదాద్రి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా పునర్నిర్మించడం జరిగింది. ఈ ఆలయ పునర్ నిర్మాణం తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.

ఇక, అప్పటినుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఇప్పడు తాజాగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆనాటి సంప్రదాయాలు, ఆచారాలను వెలికి తీసింది. పాత ఆచారాలను మళ్లీ పునరుద్ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రిపై గిరిప్రదక్షిణ చేసేందుకు అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులందరీకి గిరి ప్రదక్షిణ సేవలు..
వీటితోపాటు యాదాద్రి గుట్టపై స్వావామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంకా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం, కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను కూడా పునరుద్ధరించారు. అయితే, యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేయడం మనం చూస్తూనే ఉన్నాయం. ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం స్వామివారి ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గిరి ప్రదక్షిణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
5 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ...
తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు ఉంది. అదే తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్ల మేర ఉండనుంది. లక్ష్మీనరసింహుని గిరికి గిరిప్రదక్షిణ వీధిని ఏర్పాటు చేయటం వల్ల ఆలయానికి మరింత అందం రానున్నట్లు ఆలయ అధికారులు అంటున్నారు. అయితే తెలంగాణలో "గిరి ప్రదక్షిణ"ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం ప్రత్యేకత చాటుకుంది.
జూన్ 18వ తేదీన లక్ష్మీనరసింహ స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని, ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో వివరించారు. స్వామి వారి కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications












