దేశంలోని ఈ నగరాల్లో పిండ ప్రదానం చేస్తే.. మోక్షం లభిస్తుందట..!
హిందూ మతం ఆచార వ్యవహారాలతో నిండి ఉంది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తన జీవితంలో అనేక ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మరణించిన తర్వాత కూడా అనేక ఆచారాలు పాటించాల్సి ఉంది. అలాంటి ఒక ఆచారమే పిండ ప్రదానం. పితృ పక్షం సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులకు తర్పణం, పిండదానం చేస్తే తప్ప జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభించదని నమ్మకం.
ప్రతి సంవత్సరం పితృ పక్షం సందర్భంగా, దేశంలోని అనేక నగరాల్లో పిండ ప్రదానం నిర్వహించేందుకు ప్రజలు నదుల ఒడ్డుకు చేరుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు తన తండ్రి రాజు దశరథుడికి మూడు ప్రదేశాలలో పిండప్రదానం చేశాడు. అందులో ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున మొదటిది. రెండోది కాశీలో, మూడోది గయా ధామ్లో ప్రదానం చేశాడు. అయితే, పిండ ప్రదానం చేసేందుకు దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పడు వాటిని ఓసారి చూద్దాం.

గయా
బీహార్లోని ఒక ముఖ్యమైన నగరం గయా. ఇక్కడ, పితృ పక్ష జాతరలో పూర్వీకులకు పిండదానం, తర్పణం సమర్పించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. గయలోని ఫల్గు నది ఒడ్డున పిండప్రదానం నిర్వహిస్తారు. ప్రజలు ముందుగా ఫల్గు నదిలో స్నానం చేసి తమను తాము శుద్ధి చేసుకుంటారు. ఆ తర్వాత బ్రాహ్మణులు సూచించిన పద్ధతిలో తమ పూర్వీకులకు పిండ ప్రదానం ప్రక్రియను నిర్వహిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేటప్పుడు చనిపోయిన వారి అనుభూతి పొందినట్లు కొంతమంది భక్తులు చెబుతున్నారు.
బద్రీనాథ్..
చార్ ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్లోని అలకనంద ఒడ్డున పిండ ప్రదానం నిర్వహించేందుకు ముఖ్యప్రదేశంగా చెప్పుకుంటారు. ఇక్కడ బ్రహ్మ కపాల్ ఘాట్ వద్ద పిండ ప్రదానం చేస్తారు. ముందుగా ప్రజలు నదిలోని పవిత్ర జలాల్లో స్నానం చేసి, బ్రాహ్మణులు సూచించిన పద్ధతిలో మంత్రాలను పఠించడం ద్వారా వారి పూర్వీకులకు పిండ ప్రదానాన్ని అందిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తుందనేది నమ్మకం.
వారణాసి
వారణాసి గంగా ఘాట్ భారతదేశంలో పితృ పక్షం సమయంలో పిండ ప్రదానం అందించే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గంగా ఘాట్ల వద్ద పిండ ప్రదానం నిర్వహించడం చాలా పురాతనమైన సంప్రదాయం.
పుష్కర్
బ్రహ్మదేవుని ఏకైక ఆలయం పుష్కర్. పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు విష్ణువు నాభి నుండి జన్మించాడు. పుష్కర్ పవిత్ర సరస్సు కూడా విష్ణువు నాభి నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ సరస్సు చుట్టూ మొత్తం 52 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లలో చాలా వరకు, పితృ పక్షంలో ఆశ్విన్ మాసంలోని కృష్ణ పక్షం నుండి పిండ ప్రదానాలను నిర్వహిస్తారు.

ఉజ్జయిని
మహాకాల్ నగరమైన శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలో పిండ ప్రదానాన్నినిర్వహిస్తారు. ఉజ్జయినిలోని భైరవగఢ్ ప్రాంతంలోని క్షిప్రా నది ఒడ్డున పిండ ప్రదానం చేస్తారు. ఈ ప్రదేశంలో ఒక మర్రి చెట్టు ఉంది. దీనిని తల్లి పార్వతి తన చేతులతో నాటినట్లు చెబుతారు. మొఘల్ పాలకులు కూడా ఈ చెట్టును నాశనం చేయాలని ప్రయత్నించారు. కానీ అది విఫలమైంది. పురాణాల ప్రకారం, మహాభారత యుద్ధం తర్వాత, పెద్ద పాండవ యుధిష్ఠిరుడు ఉజ్జయినిలోనే తన వంశంలోని సోదరులు, సోదరీమణులందరికీ ఇక్కడే పిండ ప్రదానం చేశాడట..

అయోధ్య
అయోధ్య పవిత్ర పుణ్యక్షేత్రం. పిండ ప్రదానం చేసే అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ఇది పేరుగాంచింది. అయోధ్యలోని పవిత్రమైన సరయూ నది ఒడ్డున ఉన్న భట్ కుండ్ వద్ద బ్రాహ్మణుల పర్యవేక్షణలో పిండ ప్రదానం నిర్వహించబడుతుంది. వీటితో పాటు కోల్కతా, ప్రయాగ్రాజ్, హరిద్వార్, మధుర, జగన్నాథ్ పూరిలలో కూడా పిండ ప్రదానానికి ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశాలన్నింటిలో ఏడాది పొడవునా పిండదానం కొనసాగినప్పటికీ, హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్విన్ కృష్ణ పక్షం 1వ తేదీ నుండి అమావాస్య వరకు చేసే పిండదానం, పితృతర్పణం చాలా ముఖ్యమైనవి. అమావాస్య రోజును మహాలయ అని కూడా పిలుస్తారు. ఆ మరుసటి రోజు నుండి పితృ పక్షం ముగిసి దేవి పక్షం (నవరాత్రి) ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మహాలయ నాడు చేసే పితృ తర్పణానికి విశేష ప్రాముఖ్యత ఉంది.



Click it and Unblock the Notifications













