ఒడిశా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టును శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ అని కూడా పిలుస్తారు.
హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఇందుకోసం 80 ప్లటూన్ల పోలీసు బలగాలను మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డీజీపీ వివరించడం జరిగింది. సుమారు వంద మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 800 కోట్లను ఖర్చుచేశారు. జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. 12వ శతాబ్దంనాటి ఆధ్యాత్మిక పూరీక్షేత్రం ఔనత్యాన్ని మరింత పెంచేందుకు ఒడిశా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
జగన్నాథపురి ఆలయంలో శ్రీమందిర్ పరిక్రమ కారిడార్ను సిద్ధం చేయడం కూడా ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు, భక్తులు శ్రీమందిరానికి ప్రదక్షిణలు చేసే సమయంలో వారికి ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు నీలచక్ర ఆలయ దర్శనం పొందేలా చూసుకోవాలి. శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్టులో ఆలయం చుట్టూ చతురస్రాకారంలో కారిడార్ను సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కారిడార్ను 9 జోన్లుగా విభజించారు. ఇందులో 7 మీటర్ల గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది. 10 మీటర్ల అంతర్గత ప్రదక్షిణ, 14 మీటర్ల ల్యాండ్స్కేప్ జోన్, 8 మీటర్ల బాహ్య ప్రదక్షిణ, భక్తుల కోసం 10 మీటర్ల వివిధ సౌకర్యాలు, 4.5 మీటర్ల సర్వీస్ లేన్, 4.5 మీటర్ల ఎమర్జెన్సీ లేన్, 7.5 మీటర్ల మిక్స్డ్ ట్రాఫిక్ లేన్, చెట్లతో కూడిన 7 మీటర్ల ఫుట్పాత్ ఉంటాయి. సుమారు 6000 మంది భక్తులు ఒకేసారి క్యూలో ప్రదక్షిణలు చేసే విధంగా దీనిని రూపొందించారు.

జనవరి 15 నుండి 17 వరకు వేదాలు పఠించనున్నారు...
అంతేకాదు, సుమారు 4000 మంది భక్తుల బ్యాగులు ఉంచేందుకు క్లాక్ రూం, ఆలయ భద్రత కోసం బ్యాగుల తనిఖీ, తాగు నీటి లభ్యత, విశ్రాంతి గదులు, చేతులు, కాళ్లు కడుక్కోవడానికి సౌకర్యాలు, వివిధ రకాల సమాచారం, విరాళాలు పొందేందుకు కియోస్క్లు వంటివాటిని రూపొందించారు. 4 ద్వారాల వద్ద 4 వేదాలను పఠించడం జరుగుతుంది. జనవరి 15 నుండి 17 వరకు జగన్నాథ ఆలయంలోని నాలుగు ద్వారాల వద్ద వేదాలు పఠించనున్నారు. తూర్పు ద్వారం వద్ద ఋగ్వేదం, దక్షిణ ద్వారం వద్ద యజుర్వేదం, పశ్చిమ ద్వారం వద్ద సామవేదం, ఉత్తర ద్వారం వద్ద అథర్వేదం పఠిస్తున్నారు. జగన్నాథ ఆలయాన్ని తన అత్త ఇంటికి కలిపే ఆలయం నుండి 3 కిలోమీటర్ల పొడవైన రహదారిని వివిధ రంగుల రంగోలితో అలంకరించడం జరుగుతంది. జగన్నాథ ఆలయ ప్రాంగణం లోపల, వెలుపల అన్ని ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.
90 పుణ్యక్షేత్రాలు ఆహ్వానం..
పూరీలోని శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒడిశాలోని 90 పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. వీటితోపాటు వైష్ణో దేవి, కామాఖ్య ఆలయం, షిర్డీ సాయి దేవాలయం వంటి దేశంలోని దాదాపు 180 ఆలయాలు కూడా ఈ మూడు రోజుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకున్నాయి. ఈ వేడుకలో పాల్గొనేందుకు చార్ ధామ్లలోని మిగిలిన 3 ధామ్లకు, నేపాల్ రాజుకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు దేశ, విదేశాల్లోని ప్రముఖ హిందూ దేవాలయాలకు కూడా ఆహ్వానాలు అందాయి.



Click it and Unblock the Notifications













