తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చారిత్రక ఆనవాళ్లుగా పేరొందిన కట్టడాలు కూడా ఎన్నో. వీటిలో చాలా కట్టడాలు మంచి శిల్పకళతో, అందమైన నిర్మాణాలతో ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొలనుపాకలోని జైన దేవాలయం ఈ జాబితాలో ముందుంటుంది. ఈ పురాతన ఆలయానికి రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయం రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని కొలనుపాక ఊళ్లో వెలసింది. కొలనుపాక ఆలయ చరిత్రతో పాటు ఇక్కడి విశేషాలేంటో తెలుసుకుందాం పదండి...
ఇది తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన జైన మందిరంగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్-వరంగల్ హైవే పై హైదరాబాద్ నుంచి సుమారు 77 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చాలు. ఈ ఆలయంలో మూడు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఒక్కొక్కటి రిషభ, స్వామి నేమినాథ్, స్వామి మహావీరుడు. రిషభ నాథుడిని 'మాణిక్య దేవ' అని కూడా పిలుస్తారు. ప్రధాన ఆలయానికి రెండువైపులా 8 మంది తీర్థంకరుల శిల్పాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది.
130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న మహావీరుని విగ్రహం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని 'జేడ్' అనే రాయితో తయారుచేసినట్లు చరిత్ర చెబుతోంది. 4వ శతాబ్ద కాలంలో తెలంగాణలో జైనమతం బాగా వ్యాప్తిలో ఉండేది. జైనమతానికి మొదటి నుంచి కొలనుపాక ప్రధాన కేంద్రంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక, ఈ పురాతన ఆలయం కట్టడంలో ఎర్రని ఇసుక రాయిని, పాలరాతి పిల్లర్లని వాడారు. జైన మతంలోని శ్వేతాం బరులకి కొలనుపాక ప్రధాన పూజా కేంద్రంగా ఉండేదని ఇక్కడివారు చెబుతున్నారు.

మరో ప్రధాన ఆలయం...
ఇక్కడి ప్రధాన ఆలయానికి ఇరువైపులా సిమందర్ స్వామి, మాతా పద్మావతి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక్కడ ప్రసిద్ధిచెందిన మరో ఆలయం కూడా ఉంది. అదే సోమేశ్వర ఆలయం. దీనిని చాళుక్యులు 800 సంవత్సరాల క్రితం స్థాపించారు. కొలను అంటే సరస్సు, పాకా అంటే గుడిసె అని అర్థం. అప్పట్లో ఇక్కడ చాలా సరస్సులు, గుడిసెలు ఉండేవని అంటుంటారు. అందుకే ఈ ప్రాంతానికి ఈ కొలనుపాక అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

చేరుకోవడం ఎలా..?
ఈ కొలనుపాకలో వెలసిన ఈ పురాతన ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా భువనగిరి కేంద్రం నుంచి సుమారు 34కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక ఆలయానికి చేరుకోవాలి. ఆ తర్వాత కొలనుపాక బస్టాండ్ నుంచి జైన దేవాలయానికి ఆటోలు లేదా గుర్రపు బగ్గీల్లో చేరుకోవచ్చు. వరంగల్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కొలనుపాక చేరుకోవచ్చు. అదే హైదరాబాద్ నుంచి అయితే 77 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పర్యాటకుల సందర్శన కోసం తెరిచే ఉంటుంది. వన్ డే ట్రిప్లో కూడా ఈ ప్రాంతాన్ని చూసేయొచ్చు. తమ సొంత వాహనాల్లో కూడా వెళ్లొచ్చు. సొంత వెహికల్స్లో వెళ్లలేని వారికి తెలంగాణ టూరిజం ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ కూడా ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా అతి తక్కువ ధరతో కొలనుపాకలోని జైన మందిరంతోపాటు యాదాద్రి ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు. మరెందుకాలస్యం కొలనుపాక ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరీ...



Click it and Unblock the Notifications













