కేరళ వ్యాప్తంగా ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, రవాణా మార్గాలపై ప్రభావం పడేలా కనిపిస్తోంది. మరోవైపు, సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది సెప్టెంబర్ 19న అల్పపీడనంగా మారి, ఉత్తరాంధ్ర వైపు వర్షాలను మోసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే పర్యాటకులు బీచ్లు, ఫెర్రీలు, హౌస్బోట్ ప్లాన్లను ముందే రీషెడ్యూల్ చేసుకోవడం బెటర్.
కేరళ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడనున్నాయి. దీనివల్ల అలెప్పి బ్యాక్వాటర్ క్రూయిజ్లు, మూన్నార్, వయనాడ్ ఘాట్ రోడ్లు, చిన్నపాటి ట్రెక్కింగ్ ప్లాన్లకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. కొండ ప్రాంతాల రోడ్లపై ప్రయాణం ఆలస్యమవ్వడమే కాకుండా ఘాట్ రోడ్లు బాగా జారే అవకాశం ఉంది. కాబట్టి అడ్వాన్స్ పేమెంట్లు చేసే ముందే హోటళ్లు, ట్రావెల్ ఆపరేటర్ల రిఫండ్, వాతావరణ ఆధారిత నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం.

కేరళ వర్షాల అలర్ట్: ప్రయాణాలపై ప్రభావం.. ఇలా ప్లాన్ చేసుకోండి!
ప్రయాణికులు కాస్త జాగ్రత్తగా, సరైన సమయాన్ని ప్లాన్ చేసుకుంటే కేరళ పర్యటనను ఇప్పటికీ సురక్షితంగా పూర్తి చేయవచ్చు. వర్ష హెచ్చరికలు తగ్గే వరకు అలెప్పి, కుమరకోమ్లలో హౌస్బోట్ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. బుకింగ్ సమయంలో రీషెడ్యూల్ ఆప్షన్లు, క్యాన్సిలేషన్ నిబంధనలను రాతపూర్వకంగా తీసుకోండి. ఇక మూన్నార్, వయనాడ్, తేక్కడి ఘాట్ రోడ్లలో వెళ్లేవారు ఉదయమే ప్రయాణం ప్రారంభించడం మంచిది. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నందున ఎప్పటికప్పుడు అప్డేట్స్ గమనిస్తూ, వర్షాలు పడుతున్నప్పుడు రాత్రిపూట డ్రైవింగ్ చేయకపోవడమే శ్రేయస్కరం.
సెప్టెంబర్ 19న అండమాన్లో అల్పపీడనం: ఉత్తరాంధ్ర బీచ్లు, ఫెర్రీ ప్రయాణికులకు అలర్ట్
ఉత్తర థాయ్లాండ్ వైపు నుంచి వస్తున్న వాతావరణ మార్పుల వల్ల సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19న అల్పపీడనం ఏర్పడి.. పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఓడరేవులకు హెచ్చరికలు ఏవీ జారీ చేయనప్పటికీ, శుక్రవారం నుంచి పరిస్థితులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
విశాఖపట్నం బీచ్లకు, అండమాన్ ఫెర్రీ ప్రయాణాలకు వెళ్లేవారు సెప్టెంబర్ 19 నుంచి 21 మధ్య కాస్త చూసుకొని ప్లాన్ చేసుకోవడం బెటర్. వాటర్ స్పోర్ట్స్ బుక్ చేసుకునే ముందు సీడబ్ల్యూసీ భువనేశ్వర్ హెచ్చరికలను ఒకసారి చెక్ చేసుకోండి. అండమాన్లో బోటు ప్రయాణాలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని యంత్రాంగం తెలిపింది, కాబట్టి రీఫండబుల్ టిక్కెట్లు తీసుకోవడమే సురక్షితం. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రమాదకర అలల ప్రాంతాలు, బండరాళ్ల వద్ద ఈత కొట్టడం, మద్యం సేవించి నీటిలోకి దిగడం లాంటివి అస్సలు చేయకండి.
ఈ వర్షాల వల్ల దక్షిణ భారత పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, వాతావరణానికి తగినట్లుగా చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్ 20 వరకు కేరళ అలర్ట్లను, సెప్టెంబర్ 18-19 మధ్య అండమాన్ అల్పపీడన పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండండి. కొచ్చి లేదా మైసూర్ వంటి ప్రాంతాల్లో వర్షంలోనూ సందర్శించగలిగే హెరిటేజ్ వాక్స్, స్థానిక తినుబండారాల రుచులను ఆస్వాదించండి. వర్షం వెలిసిన సమయంలోనే బీచ్లు, బ్యాక్వాటర్స్ వైపు వెళ్లడం ఉత్తమం.



Click it and Unblock the Notifications