మధ్యప్రదేశ్లో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా పురాతన కట్టడాలు, చారిత్రక కోటలు మరెన్నో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక కట్టుబాట్లను తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఇక్కడి ప్రదేశాలను సందర్శించాల్సిందే. మధ్యప్రదేశ్లోని ఖజురహో ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. ఖజురహో దాని చారిత్రాత్మక ఆకర్షణకు ఎంతో గుర్తింపు పొందింది.
అంతేకాదు ఇది ఇది ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ, పురాతన దేవాలయాలకు నిలయమని చెప్పుకోవాలి. ఖజురహో నగారా-శైలి శిల్పకళ మరియు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి యేటా నృత్య పండుగను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈసారి జరగబోయే ఫెస్టివల్ 50వ డ్యాన్స్ ఫెస్టివల్. ఇది ఫిబ్రవరి 20 నుండి మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ప్రారంభమవుతుంది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ విశేషాల గురించి తెలుసుకుందాం.
ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు, కళాకారులు తరలి వస్తుంటారు. ఈ పండుగలో పాల్గొనడం వల్ల ఇక్కడి గొప్ప సంస్కృతి, వారసత్వ, చారిత్రక విషయాలను నేరుగా చూసే అవకాశం లభిస్తుంది.

కథక్-కుంభ్ ప్రత్యేక ఆకర్షణ...
ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి 20 నుండి మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ప్రారంభం కానుంది, ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఖజురహోలో ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అకాడమీ, మధ్యప్రదేశ్ కల్చర్ కౌన్సిల్, భోపాల్ ద్వారా మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ, పురావస్తు శాఖ భాగస్వామ్యంతో ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈసారి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. దీనిని మొదటిసారిగా 1975లో ప్రారంభించారు.
ఇందులో మరో విశేషం ఏమిటంటే, ఈ ఫెస్టివల్లో కథక్ కుంభ్ కూడా నిర్వహిస్తారు. ఈ నెల 20న 1500 నుండి 2000 మంది కథక్ నృత్య కళాకారులతో కలసి ఓ సామూహిక నృత్య ప్రదర్శన ఇస్తారు. దీనిని "కథక్-కుంభ్ అని పిలుస్తారు. ఈ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
ఈ సారి జరగబోయే ఫెస్టివల్లో తొలిసారిగా లయశాల నిర్వహించనున్నారు. భారతీయ నృత్య రీతుల వారి సంబంధిత విభాగాలకు చెందిన ఉత్తమ గురువులతో శిష్యుల సంగమం, వర్క్షాప్లు ఉండనున్నాయి. ఇందులో భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మోహినియాట్టం, కూచిపూడి, కథాకళి, యక్షగాన, మణిపురి మొదలైనవన్నీ ప్రదర్శిస్తారు. దీంతోపాటు ప్రధాన శాస్త్రీయ నృత్య రీతులకు చెందిన యువ, సీనియర్ కళాకారులు ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో తమ కళల సౌరభాన్ని చాటుతారు.

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు...
ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు, కళాకారులు వస్తుంటారు. పర్యాటకులకు సాంస్కృతిక కార్యక్రమాలను చూడటమే కాకుండా అనేక రకాల సాహస కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. స్కై డైవింగ్, క్యాంపింగ్, ట్రైల్ జాయ్ రైడ్, వాటర్ అడ్వెంచర్, స్పీడ్ బోట్, బనానా రైడ్, షికారా బర్డ్, రాఫ్టింగ్, విలేజ్ టూర్, ఈ-బైక్ టూర్, రానేహ్ ఫాల్ టూర్, దాట్లా పహాడ్, సెగ్వే టూర్, ఖజురహో నైట్ టూర్, ఫామ్ వంటి కార్యకలాపాలు ఇక్కడ పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వీటితోపాటు మధ్యప్రదేశ్ రూపాంకర్ కళా పురస్కారం, ప్రదర్శన, అలంకరణ వేడుకలు కూడా జరగనున్నాయి. ఇందులో రాష్ట్రంలోని పేరుగాంచిన రూపాంకర్ కళాకారుల పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 రాష్ట్రస్థాయి అవార్డులను ఎంపికైన కళాకారులకు అందజేయనున్నారు. మరెందుకాలస్యం మీరు కూడా ఈ డ్యాన్స్ ఫెస్టివల్ను చూసేయండి మరీ.



Click it and Unblock the Notifications













