తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో క్షీర జలపాతం ఉంది. వర్షాకాలంలో మాత్రమే కొత్తసొగసులు అద్దుకున్న ప్రకృతి అందాలు ఇక్కడ దర్శనమిస్తాయి. చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఈ సీజన్లో మాత్రమే క్షీర జలపాతం కొత్తరూపు సంతరించుకుంటుంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకు మంచిర్యాల జిల్లా పరిధిలోని పర్యాటకులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భారీగా సందర్శకులు వస్తున్నారు. వారాంతాల్లో ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది.
పేరుకు తగ్గట్టుగానే స్వచ్ఛతకు మారుపేరు...
క్షీర జలపాతం ఇటీవల కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రకృతి ప్రేమికులకు క్షీర జలపాతం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. సుమారు వంద అడుగుల ఎత్తులో నుంచి ఉదృతంగా కిందకు దూకుతోన్న నీటి ప్రవాహపు అందాలను ఎవరు ఆస్వాదించరు చెప్పండి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి అందిస్తోంది ఈ క్షీర జలపాతం. పేరుకు తగ్గట్టుగానే ఈ జలపాతం నీరు స్వచ్ఛతకు మారుపేరులా పాలవలే స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ పచ్చదనం కమ్మేసిన ప్రకృతి అందాలు అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు మనలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నగర జీవనంతో విసిగిన మనసులకు ఇదో ప్రశాంతతను అందించే మందనే చెప్పాలి.
క్షీర జలపాతానికి రోడ్డు సౌకర్యం లేదు
నేరుగా క్షీర జలపాతం చేరుకోవడానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. మేడారం నుంచి దట్టమైన అడవిలో మూడు కిలోమీటర్ల మేర నడిచిన తర్వాత క్షీర జలపాతం దర్శనమిస్తోంది. దట్టమైన అడవిలో కాలినడకను బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే, నడక మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే క్షీర జలపాతం నీటి సవ్వడులు రా.. రమ్మంటూ మీకు ఆహ్వానం పలుకుతాయి. దాంతో అలసట దూరమైపోవడంతోపాటు మీ అడుగులు వేగాన్ని అందుకుంటాయి. అయితే పర్యాటకులు కాలి నడక మార్గంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికులు లేదా గొర్రెల కాపర్ల సహాయం తీసుకోవడం మంచిది. హైదరాబాద్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే పర్యాటకులు మొదటగా మంచిర్యాల - ఆసిఫాబాద్ రోడ్డుకు చేరుకోవాలి. మంచిర్యాల టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మేడారం గ్రామం ఉంటుంది. మేడారం నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర కాలినడక ప్రయాణం చేయాలి. దారి మధ్యలో గాంధారి పోర్ట్ను కూడా పర్యాటకులు గుర్తించొచ్చు. ఈ కోట పరిధిలో అనేక రకాల ఔషద మూలికలు కలిగిన మొక్కలను వీక్షించవచ్చు. వీటి కోసం అనేక మంది ఈ ప్రాంతంలో నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. స్థానిక గిరిజనులు రెండేళ్లకొకసారి ఇక్కడ పెద్ద జాతరను నిర్వహిస్తారు. గాంధారి కోట మందమర్రి మండలంలోని బొక్కల గుట్ట సమీపంలో ఉన్న ఒక కొండ మీద ఉంది. ఈ కొండ ఇసుక రాతి కొండ.
వర్షాకాలంలో మాత్రమే దర్శనమిచ్చే క్షీర జలపాతం..
పచ్చని అటవీ మార్గంలో కాలి నడకన ప్రయాణం చేస్తూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ముందుకు వెళుతుంటే ఎలా ఉంటుంది. ఒక్క ప్రయాణం దగ్గరే ఆగిపోకుండా ఉరకలు వేసే జలపాతం కనురాలా వీక్షించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. అక్కడి ప్రకృతి అందాలకు సహజసిద్ధ జలపాతం అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. అది కూడా వర్షాకాలంలో మాత్రమే దర్శనమిస్తుంది అంటే తప్పకుండా చూడాల్సిందే కదా! మరెందుకు ఆలస్యం.. ఇక వెళ్దాం పదండీ క్షీర జలపాతం చూసేందుకు..!
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో క్షీర జలపాతం ఉంది. వర్షాకాలంలో మాత్రమే కొత్తసొగసులు అద్దుకున్న ప్రకృతి అందాలు ఇక్కడ దర్శనమిస్తాయి. చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఈ సీజన్లో మాత్రమే క్షీర జలపాతం కొత్తరూపు సంతరించుకుంటుంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకు మంచిర్యాల జిల్లా పరిధిలోని పర్యాటకులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భారీగా సందర్శకులు వస్తున్నారు. వారాంతాల్లో ఇక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది.