బనారస్ పేరు వినగానే ప్రజలు ముందుగా గుర్తుచ్చేది. ఇక్కడి గంగా హారతి. ఇక్కడి అందమైన వీధులు. ఈ ధార్మిక ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుండి తరలి వస్తుంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఈ నగరం ఆహారం, సంప్రదాయాలకు కూడా పెట్టింది పేరు. బనారస్ అనేక విధాలుగా ఎంతో ప్రత్యేకమైనది. ఇది ప్రపంచంలోనే అతిపురాతనమైన నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. బనారస్ను వారణాసి, కాశీ వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము ఇది. ఈ ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. ఇక్కడి వీధులు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతం అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా మనకు కనిపిస్తోంది. ఈ ప్రదేశం బనారసి చీర, పాన్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బనారస్ వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతాలను సందర్శించాల్సిందే. రండి అవెంటో చూసేద్దాం..

గంగా హారతి..
బనారస్లో అత్యంత ప్రసిద్ధిచెందింది. గంగా హారతి. చాలామంది పర్యాటకులు కేవలం ఈ హారతి కోసమే ఇక్కడకు వస్తుంటారు. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రతి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ గంగా హారతిని నిర్వహిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ఈ హారతి అస్సీ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్ వద్ద కూడా జరుగుతుంది. దీన్ని చూడటానికి ఆన్లైన్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారు ఘాట్ మెట్ల మీద, లేదంటే పడవ, హౌస్ బోట్లో కూర్చుని చూడొచ్చు.

సారనాథ్
మహాత్మా బుద్ధుడు మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం కూడా బనారస్లోనే ఉంది. దీనినే సారనాథ్ అంటారు. ఇది క్రమేపీ బౌద్ధ యాత్రా స్థలంగా కూడా మారింది. ఇక్కడ ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన అశోక స్తంభంలో నాలుగు సింహాలు మరియు ధర్మ చక్రం ఉన్నాయి. జాతీయ జెండా సర్కిల్ ఇక్కడ నుండి తీసుకోబడిందని చెబుతుంటారు. అంతేకాదు, ఇక్కడ ధమేఖ్ స్థూప సముదాయం, బౌద్ధ విహారం, అశోక స్తంభం, మ్యూజియంను కూడా సందర్శించొచ్చు. ఈ ప్రదేశం చారిత్రక ప్రాముఖ్యతను కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పడవ ప్రయాణం
బనారస్ ఘాట్ల అద్భుతమైన దృశ్యాన్ని చూడాలనుకునేవారు తప్పకుండా సుబా-ఎ-బనారస్ని అస్సలు మిస్ అవ్వకండి. అందుకోసం ఉదయాన్నే బోట్ రైడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పడవ ప్రయాణంలో విహరిస్తూ ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను తిలకించడంతో పాటు ఉదయించే సూర్యుడి అందాలను కూడా వీక్షించొచ్చు. ఇంకా ఈ బోటులో షికారు చేస్తూ గంగా హారతిని కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు.
రాంనగర్ కోట
గంగా నది ఒడ్డున ఉన్న రామ్నగర్ కోటను కాశీ రాజు బల్వంత్ సింగ్ నిర్మించాడు. దీనిని చునార్ ఇసుకరాయితో నిర్మించారు. ఇక్కడి మొఘల్ శిల్ప శైలి మరియు శిల్పకళను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. వీటితోపాటు ఇక్కడ ఉన్న మ్యూజియంలో ఉంచబడిన కాశీ రాజు యొక్క ఫిరంగులు, పాతకాలపు కార్లు, తుపాకులు, ఇతర ఉపకరణాలు కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలు అని చెప్పొచ్చు. మరెందుకాలస్యం మీరు కూడా బనారస్ పర్యటనకు బయలుదేరండి మరి.



Click it and Unblock the Notifications












