శీతాకాలపు చల్లగాలుల వేళ.. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుంటున్నాయి. పచ్చని ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికులను ఆహ్వానిస్తున్నాయి. దీనికితోడు, వరుస సెలవులు రావడంతో మన్యంలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకుల కేరింతలతో మరింత అందాన్ని సంతరించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అనంతగిరి, చింతపల్లి, లంబసింగి, అరుకు వంటి అటవీ ప్రాంతాలు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. ఇక్కడి ఏజెన్సీలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేస్తున్నారు.
ప్రకృతి ప్రేమికుల విడిది కేంద్రంగా అనంతగిరిలోని బొర్రా గుహలు నిలుస్తున్నాయి. దీంతోపాటు చింతపల్లి మండలం లంబసింగికి పర్యాటకులు పోటెత్తున్నారు. ఎత్తయిన శిఖరాగ్రం నుంచి జాలువారే కటికి, తాడిగుడ జలపాతాలు ఇక్కడికి వచ్చేవారికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం ప్రాంతాలు సందర్శకుల చూపు తిప్పుకోనీయడం లేదంటే నమ్మండి.

మేఘాలను ముద్దాడుతోన్న వంజంగి కొండ
పాడేరులోని వంజంగికి చేరుకుంటే చాలు. ఆకాశాన్నితాకే మేఘాలు కొండను ముద్దాడుతున్నాయా అన్నట్లు దర్శనమిస్తోంది అక్కడి ప్రాంతం. ఈ అందాలు ఆశ్వాదించేందుకు ముందురోజే పాడేరుకు చేరుకుని, అక్కడ విడిది చేయాల్సి ఉంటుంది. లేకుంటే, వంజంగి చేరుకుంటే అక్కడే టెంట్లు, రిసార్ట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో బస చేయవచ్చు. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు క్యాంప్ ఫైర్, గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా, ఉదయం 5 గంటల నుంచి కొండపైకి చేరుకొని పాల సముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు వంటి ప్రకృతి దృశ్యాల నడుమ తారసపడే అక్కడి అందాలను మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.
ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి..
మనవాళ్లు.. ఆంధ్ర కాశ్మీర్గా పిలుచుకునే లంబసింగికి కూడా పర్యాటకులు బారులుతీరుతున్నారు. ఇక్కడికి కూడా పర్యాటకులు ముందు రోజే చేరుకోవడం ద్వారా వేకువ ప్రకృతి అందాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం పర్యాటకులతో శీతాకాలపు పొగమంచును ఆస్వాదించేందుకు ఆహ్వానం పలుకుతోంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద నుంచి చూస్తే.. ఎత్తుపల్లా కొండల మధ్య దాగిన పచ్చని ప్రకృతి పర్యాటక ప్రేమికులను రా.. రమ్మని పిలుస్తోన్న అనుభూతి కలుగుతుంది.

జలపాతాల హొయలు..
ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరొక చెప్పుకోదగ్గ ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో ఇక్కడ పర్యాటకులతో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచే పర్యాటకులతో జలపాతం చుట్టుపక్కల ప్రాంతం కిటకిటలాడుతూ కనిపిస్తుంది. అలాగే, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి కూడా దీంతో పోటీపడుతోంది. కుటుంబసమేతంగా వచ్చే సందర్శకులతో జలపాతం వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఇక్కడికి వచ్చే సందర్శకులు తమ వాహనాల పార్కింగ్ కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చిన్న చిన్న పార్కింగ్ ప్రదేశాలు ఉండడంతోపాటు జలపాతాల వద్దకు వాహనాలు చేరుకునేందుకు వీలు లేకపోవడం వల్ల కాలినడకన కొంత దూరం వెళ్లాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. అయినా సరే.. ఇక్కడి ప్రకృతి మీ అలసటను ఇట్టే దూరం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.



Click it and Unblock the Notifications












