మధ్యప్రదేశ్లో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పురాతనకట్టడాలు, చారిత్రాత్మక భవనాలు, ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు మరెన్నో. భారతదేశంలో ఉన్న ప్రతి నగరానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్రను తెలుసుకోవాలంటే ఇక్కడి ఆలయాలను వీక్షించాల్సిందే. ప్రకృతి సహజ సౌందర్యానికి నిదర్శనం ఈ ప్రాంతం. ఈ రాష్ట్రం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు.
మధ్యప్రదేశ్ భారతదేశంలోని అందమైన రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఎన్నో వన్యప్రాణుల అభయారణ్యాలు, చారిత్రక నగరాలు కూడా ఉన్నాయి. జూన్ నెలలో సెలవుల్లో ఇంట్లో కూర్చొని విసుగు చెందితే మాత్రం తప్పకుండా మధ్యప్రదేశ్లలోని ఈ ప్రాంతాలను సందర్శించాల్సిందే. ఉజ్జయిని నుండి భోపాల్ వరకు ఇక్కడ సందర్శనకు అనువైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో సందర్శించాల్సిన ప్రత్యేక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖజురహో
ఖజురహోలోని ఖజురహో దేవాలయాలు ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చబడ్డాయి. ఈ ప్రదేశంలో అందమైన శిల్పాలు, కళాఖండాలతో కూడిన దేవాలయాలు చూడొచ్చు. ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామం. ఈ ప్రదేశం ఢిల్లీకు సుమారు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఈ దేవాలయాలు, హిందూ, జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి వచ్చింది.

గ్వాలియర్
గ్వాలియర్ మధ్యప్రదేశ్లోని చాలా ప్రసిద్ధిచెందిన నగరం. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు గ్వాలియర్ కోట, సాస్-బహు దేవాలయం. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా వాటిని చూసే వెళతారు. ఇది మధ్యప్రదేశ్లోని ఒక ప్రధాన నగరం. ఇది ఢిల్లీకి దక్షిణంగా 343 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఆగ్రా నుండి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్వాలియర్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి సుమారు 414 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి.
భోపాల్
మధ్యప్రదేశ్ను సందర్శించడానికి వచ్చినవారు తప్పకుండా ఆ రాష్ట్ర రాజధాని భోపాల్ను వీక్షించాల్సిందే. భోపాల్ నగరంలో భారత్ భవన్, తాజుల్ మస్జిద్, అప్పర్ లేక్ వంటి అనేక ఆకర్షణీయమైన ప్రదేశాలు దాగి ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు ఈ సీజన్ ఎంతో ఉత్తమం. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరం భోపాల్. ఇది భారతదేశములో 17 వ అతిపెద్ద నగరంగా కూడా నిలిచింది. భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోధన సంస్థలు ఉన్నాయి.
ఉజ్జయిని
మధ్యప్రదేశ్లోని మరో ప్రసిద్ధిచెందిన ప్రదేశం ఉజ్జయిని. దీనిని కుంభ నగరం ఉజ్జయిని మహాకాల్ నగరం అని కూడా పిలుస్తారు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా నిర్వహిస్తారు. ప్రసిద్ధ కాలభైరవ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నిరంతరం భక్తుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఉజ్జయినిలో అతి పెద్ద ఆకర్షణ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ప్రాంతం అనేక ఆలయాలకు ప్రసిద్ధచెందింది.



Click it and Unblock the Notifications












