పని ఒత్తిడితో సతమతమయ్యి, ప్రశాంతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరబాద్ సమీపంలోని నాగార్జున సాగర్ డ్యామ్ను వీక్షించొచ్చు. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. పడవ ప్రయాణం చేయొచ్చు. రండి. నాగార్జున సాగర్ విశేషాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోని ఎత్తయిన ఆనకట్టలలో ఒకటైన నాగార్జున సాగర్ విశిష్టతను దగ్గరగా చూడాలనుకునేవారికి తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో పర్యాటకులు కేవలం ఒకే ఒక్క రోజులోనే నాగార్జున సాగర్ అందాలను చూసేయొచ్చు. ఈ ఆనకట్ట ప్రపంచలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇది సుమారు 124 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
అంతేకాదు, ఈ ఆనకట్ట 26 గేట్లుతో ఇక్కడికొచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పడవ ప్రయాణం చేయాలనుకునేవారు నీటిపై తేలియాడుతూ సాగర్ అందాలను అతి దగ్గరనుంచి చూసేయొచ్చు. నాగార్జున సాగర్ అందాలను చూడాలంటే పడవ ప్రయాణం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. రండి తెలంగాణ టూరిజం అందిస్తోన్న ప్యాకేజీ వివరాలను తెలుసుకుందాం.

టూర్ షెడ్యూల్..
హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని పర్యాటకులు బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీ షెడ్యూల్ గురించి ఓసారి పరిశీలిస్తే.. ఈ టూర్ లో భాగంగా ముందుగా ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటారు.
అదే రోజు ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్కు చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక ముందుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శన ఉంటుంది. అనంతరం మధ్యాహ్నాం లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ అందాలు చూసేందుకు లాంచీలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ లాంచీలో ప్రయాణం పర్యాటకులకు ఎన్నో మధురానుభూతులను మిగులుస్తోంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ పర్యటన ఉంటుంది. 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.

టూర్ ధరలు..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీలో పాల్గొనవారికి కొన్ని ప్రత్యేక ధరలను కూడా నిర్ణయించారు పెద్దలయితే రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలకయితే రూ. 640గా నిర్ణయించారు. పర్యాటకులు ఈ టూర్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్లి https://tourism.telangana.gov.in/ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చేరుకోవడం ఎలా...?
హైదరబాద్ నుంచి ఈ ప్రాంతానికి వెళ్లాలంటే సుమారు నాలుగైదు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భాగ్యనగరం నుంచి సుమారు 165 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. ఈ ట్రిప్ను మీ కుటుంబంతో కలిసి సరాదాగా ప్లాన్ చేసుకోవచ్చు. తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సరిహద్దులపై నందికొండ వద్ద ఈ ఆనకట్టను నిర్మించారు.
ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టును అప్పటినుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు అని పిలిచేవారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఆనకట్టకు ఇరువైపుల దక్షిణ విజయపురి , ఉత్తరవిజయపురిలో భాగంగా పైలాన్, హిల్ కాలనీలు ఉన్నాయి. క్రమేణా నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధిచెందింది.



Click it and Unblock the Notifications













