కేరళ దినోత్సవం నాడు.. ప్రకృతి అందాలను చూసొద్దాం రండి...
కేరళను దేవుని సొంత దేశం అని పిలుస్తారని చాలామందికి తెలుసు. కేరళ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా... నవంబర్ ఒకటో తేదిన కేరళ దినోత్సవంగా జరుపుకుంటారు. కేరళ దినోత్సవం లేదా కేరళ పిరవి అని కూడా అంటారు. నవంబర్ 1, 1956న రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో స్వతంత్ర రాష్ట్రంగా కేరళ పుట్టినందుకు గుర్తుగా ఈ రోజును జరుపుకుంటున్నారు. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రదేశం కేవలం దేశీయులను మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
అక్కడి కాలువలు, పచ్చని చెట్ల అందాలు, కొండలు కోనలు, జలపాతాల సొగసులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రశాంతమైన బ్యాక్వాటర్లతో పాటు, కేరళ స్వచ్ఛమైన బీచ్లు, హౌస్బోట్లు, విస్తృతంగా వ్యాపించిన టీ తోటలు, ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో కూడిన భవనాలు, ఆయుర్వేద శానిటోరియంలు, అద్భుతమైన రుచులకు కూడా పేరుగాంచింది. రోజు వారీ ఉద్యోగ టెన్షన్లు, కుటుంబ బాధ్యతలు, టార్గెట్ ఒత్తిళ్ల నుంచి మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ కేరళ దినోత్సవం నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి దీని విశేషతలను తెలుసుకోండి.

పర్వతాలు, బీచ్లు..
కేరళలో సందర్శించేందుకు పర్వతాలు, బీచ్లు వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. శీతాకాలంలో, ప్రజలు పర్వతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. బీచ్లు ఉన్న ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ప్రయాణపు ప్రణాళికలో కేరళను చేర్చుకోవచ్చు. శీతాకాలంలో కూడా ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి కొండ ప్రాంతాలలో మంచు కురుస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి ఆందోళన లేకుండా సౌకర్యవంతమైన దుస్తులతో తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా, కేరళలో అనేక వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. వీటిని కూడా సందర్శించొచ్చు.

హౌస్బోట్లో పర్యటన...
కేరళ సందర్శించేటప్పడు కచ్చితంగా ఇక్కడి విలాసవంతమైన హౌస్బోట్లలో బస చేసే అనుభూతిని అస్సలు మిస్సవ్వకండి. అలాగే, హౌస్బోట్లో బ్యాక్వాటర్స్లో పర్యటించడం ఒక విభిన్నమైన వినోదాన్ని కలిగిస్తుంది. ఈ హౌస్బోట్లలో లభించే సౌకర్యం సాధారణ హోటల్ గది కంటే ఎంతో సౌకర్యవంతంగా, మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతమైన అందమైన వాతావరణంలో హస్బోట్లో పర్యటిస్తుంటే ఆ మజానే వేరుంటుంది.
తేయాకు తోటలు..
పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న మున్నార్ విస్తృతమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనుచూపుమేరంతా ఆకుపచ్చని టీ పొదలు కనిపిస్తూ ఉంటాయి. తేయాకు తోటల అందాలను వీక్షించాలంటే మాత్రం తప్పకుండా మున్నార్ సందర్శించాల్సిందే.
అద్భుతమైన నిర్మాణాలు..
భారతదేశంలోని కొన్ని అద్భుతమైన నిర్మాణాలకు కేరళ నిలయం. ఇక్కడి పురాతన దేవాలయాలు, రాజభవనాలు గత కాలానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ నిర్మాణాలను చూడడం వాటి గురించి తెలుసుకోవడం గతంలోకి వెళ్లిన అనుభూతిని పర్యాటకులకు కలిగిస్తుంది. ఎందుకంటే నాటి వైభవం, కళాత్మకత ఇక్కడ పర్యాటకులకు దర్శనమిస్తాయి.
విభిన్నమైన రుచులు...
కేరళ విభిన్నమైన రుచులకు ఎంతగానో ప్రసిద్ధిచెందింది. ఇది రుచికరమైన చేపల కూరలు, జ్యుసి ప్రాన్ ఫ్రైతో సహా రుచికరమైన మత్స్య వంటకాలకు కూడా పేరుగాంచింది. శాకాహారులకు కావాలసిన వంటకాలు కూడా ఇక్కడ ఉంటాయి. వెజిటేరియన్స్ కోసం ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన సాంబార్, అవియల్ వంటివి ఎన్నో ఉంటాయి.



Click it and Unblock the Notifications













