అందాల మహబూబ్నగర్ జిల్లా పర్యాటకం అంటే అందులో పిల్లలమర్రి పేరు వినపించకపోతే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి పర్యాటక ప్రాంతం ఈ ఒక్క జిల్లాకే కాదు.. తెలంగాణ పర్యాటక రంగానికి కూడా వన్నె తెస్తోందనడంలో సందేహం లేదు. నేటికీ ఈ పిల్లలమర్రి మొదులు భాగం ఎక్కడుందో చెప్పడం కష్టమట. మరెందుకు ఆలస్యం.. ఎకరాల విస్తీర్ణం కలిగిన పిల్లలమర్రి పర్యాటక అందాలను తెలుసుకుందాం రండి!
ఆసియాలోనే రెండవ అతిపెద్ద మర్రిచెట్టుగా పేరుగాంచిన ఈ పిల్లలమర్రికి దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పిల్లలమర్రిలో మర్రిచెట్టు, దాని శాఖలు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడకి వచ్చే సందర్శకుల కోసం పార్కు, జంతు ప్రదర్శన శాల, మత్స్యశాఖ, పురావస్తు మ్యూజియం, జింకల పార్క్, అక్వేరియం వంటి అదనపు ఆకర్షణలు కూడా ఉన్నాయి.
ఇక్కడి మ్యూజియంలో మన పూర్వీకుల కాలంలో చలామణి అయిన నాణెలు, పురాతన వస్తువులూ, దేవతామూర్తుల రాతి విగ్రహాలు, గత చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలిచే మారణాయుధాలూ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పొచ్చు. ప్రకృతి అందాలతోపాటు చారిత్రక నేపథ్యాలు, ఆశ్చర్యాన్ని అందించే మహావృక్షాన్ని చూసేందుకు ఏడాదిపొడువునా పర్యాటకులు ఇక్కడకు వస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో పిల్లలమర్రి ప్రాంతం సందర్శకులతో కిక్కిరిసిపోతుంది.

చారిత్రక నేపథ్యమున్న ప్రాంతం..
ఈ ప్రాంతానికి మంచి చారిత్రక నేపథ్యం ఉంది. పిల్లలమర్రి గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. కాకతీయుల కాలం నాటి నాణెములు తవ్వకాల్లో బయటపడ్డాయి. కాకతీయ రాజుల తర్వాత పిల్లలమర్రి రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా ఉండేది. అంతేకాదు, ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం ఇదేనండోయ్. పిల్లలమర్రికి ఎదురగా 1976 సెప్టెంబరు18న నాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు పురావస్తు మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం నేటికీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

క్రీస్తు పూర్వం 600-1900 ఏళ్ళ నాటి రాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, కత్తులు, కటారులు, పాత రాతి యుగపు గొడ్డళ్ళు, నూరుడు రాళ్ళు, సూక్ష్మజాతి యుగపు పని మట్లు, 19వ శతాబ్దం నాటి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, విష్ణు బూదేవి, శ్రీదేవి విగ్రహాలు, తూర్పు చాళుక్యుల నాటి నాణాలు, నల్లరాతి బసవన్నలు, శివలింగాలు ఇందులో భద్రపరిచారు. వీటిని పర్యాటకుల సందర్శన నిమిత్తం ఉంచుతున్నారు. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల తవ్వకాల్లో బయటపడిన శిల్పాలను ఈ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరుస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
పిల్లలమర్రిలోనే సందర్శకుల కోసం జింకల పార్కు, మినీ జూ పార్కును ఏర్పాటు చేశారు. కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చేవారు సరదాగా గడిపేందుకు రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు వంటి జంతువులను ఈ జూలో అందుబాటులో ఉంచారు. వీటితోపాటు చేపల అక్వేరియం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

అయితే, పిల్లలమర్రిని చూసేందుకు వచ్చే సందర్శకులు తాకడం వల్ల వృక్షం దెబ్బతింటోందని గ్రహించిన అధికారులు దానిని నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐరన్ గ్రిల్స్ తో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టి, దూరం నుంచే పిల్లలమర్రి అందాలను చూసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా పిల్లలమర్రి నీడలో సేదదీరేందుకు వెంటనే బయలుదేరండి మరి!



Click it and Unblock the Notifications












