వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా విహారయాత్రలకు చాలామంది ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి సరదాగా విదేశాలలో విహరించే అవకాశం దొరికితే ఎలా ఉంటుంది. మరి, విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టు, వీసా కావాలి కదా! అనే సందేహంతో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే, అలాంటివారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఎలాంటి వీసా అవసరం లేకుండా మన దేశం నుంచి కొన్ని దేశాలకు విహరించేందుకు అవకాశం ఉంది. అంతేకాదు, ఆయా దేశాలకు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ఆ దేశాలే ఈ-వీసాలు, వీసా ఆన్ అరైవల్ పర్యాటకులకు అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. మండు వేసవిలో విహారానికి అనువుగా ఉండి.. విసా అవసరం లేని ఆ దేశాల జాబితాలో ఉన్న కొన్ని దేశాల విశేషాలను తెలుసుకుందాం రండి!

నేపాల్
మంచుతో కప్పబడిన హిమాలయాలలో దాగి ఉన్న నేపాల్ ప్రకృతి అందాల గురించి కొత్తగా చెప్పాల్సి పని లేదు. ఇక్కడి లేక్ టేబుల్ ల్యాండ్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఈ దేశానికి వెళ్లాలంటే వీసానే కాదు.. పాస్పోర్టు కూడా అవసరం లేదని చాలామందికి తెలియదు. ఇక్కడికి విహారానికి వెళ్లదలిచేవారు.. ఏ గుర్తింపు పత్రమైనా చూపిస్తే చాలు. ఎందుకంటే, మన భారతీయులకు నేపాల్ ఎలాంటి షరతులు విధించలేదు.

మారిషస్
ఎటుచూసినా.. జాలువారే జలపాతాలు, పచ్చదనం కమ్మేసిన అడవులు, బ్ల్యూ బే మెరీనా పార్క్, పీటర్ బోత్ కొండలు, నేచుర్ పార్క్ వంటివి మారిషస్లో చూడదగిన పర్యాటక అందాలు. ఎలాంటి కాలుష్యంలేని ప్రకృతి సౌందర్యాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. అయితే, మారిషస్ దేశంలో వీసా లేకుండా 90 రోజులు పర్యటించే అవకాశం ఉంది.
బ్యాంకాక్
యూత్ ఎంట్రాక్షన్ టూరిస్ట్ స్పాట్ ఏదైనా ఉందంటే.. అందులో ముందు వరుసలో ఉంటుంది బ్యాంకాక్. థాయిలాండ్లోని బ్యాంకాక్తోపాటు క్రిబి, ఫుకెట్, ఫిఫి దీవులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. వేసవి విహారానికి ఇక్కడికి చేరుకోవాలనుకునేవారికి ఎలాంటి వీసా అవసరం లేదు. థాయిలాండ్ చేరుకున్న తర్వాత 35 డాలర్లు చెల్లిస్తే చాలు.. టూరిస్ట్ వీసా మీ చేతిలో ఉంటుంది. ఈ వీసాతో మీరు 15 రోజుల పాటు థాయిలాండ్లోని అన్ని దీవులను సందర్శించవచ్చు.

ఇండోనేసియా
తీరప్రాంతపు అందాలతోపాటు అక్కడి ప్రత్యేకమైన నోరూరించే రుచులను ఆస్వాదించాలనుకునేవారు ఇండోనేసియా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి తీరపు కేరటాల సవ్వడులను వింటూ సేదదీరేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వేసవిలో సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఇండోనేసియాలో కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత 30 డాలర్లు చెల్లించి రెండు నెలల కాలపరిమితిలో టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు.
కాంబోడియా
చరిత్ర ప్రియులకు కాంబోడియా స్వర్గధామం లాంటింది. ఇక్కడి ప్రకృతి అందాలు మనసుకు ప్రశాంతతను చేరువ చేస్తాయనే చెప్పాలి. పురాతన బౌద్ధ ఆలయాలు, కోటలు, బురుజుల నిర్మాన శైలి చూపరును మంత్రముగ్ధులను చేస్తాయి. కాంబోడియా టూర్ ప్లాన్ చేయాలనుకునేవారు ముందగానే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఈ- వీసా తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత 30 రోజుల గడువు గల వీసా పొందవచ్చు.
ఈ దేశాలతోపాటు శ్రీలంక, మాల్దీవులు, వియత్నాం ఇలా అనేక దేశాలు విసాతో పనిలేకుండా ఔత్సాహిక పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ మండే వేసవిలో విదేశాలలో విహారయాత్రకు వెంటనే సిద్ధమవ్వండి.



Click it and Unblock the Notifications











