సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సందర్శకులను ఆహ్వానిస్తోంది
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న సిమ్లిపాల్ నేషనల్ పార్క్ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ పార్క్ వాతావరణాలకు అనుగుణంగా ఏటా కొంత కాలం మూసివేయబడుతుంది. ఈ నేషనల్ పార్క్ తలుపులు ఇప్పుడు తెరుచుకోబడ్డాయి. అధికారులు చెబుతోన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది జూన్ 16 నుండి ఉద్యానవనం పర్యాటకులకు ప్రవేశం లేకుండా మూసివేయబడింది. ఏటా వర్షాకాలంలో పార్క్ను మూసివేస్తారు.
సుమారు 2750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సిమ్లిపాల్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్లలో ఒకటిగా పేరుపొందింది. అనేక జాతుల వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తోంది. అలాంటి పేరొందిన నేషనల్ పార్క్లో విహరించేందుకు అవకాశం దొరికితే ఎవరు వదులుకుంటారు చెప్పండి. మరెందుకు ఆలస్యం సిమ్లిపాల్ నేషనల్ పార్క్ విశేషాలను తెలుసుకుందామా..

వేటగాళ్లుకు గమ్యస్థానంగా ఉండేది
గత నివేదికలను పరిశీలిస్తే ఇక్కడకు రోజుకు వందమంది కంటే ఎక్కువగా సందర్శకులు వస్తూ ఉంటారు. అనేక వన్యప్రాణుల జాతులతో పాటు, సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలం, పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇక్కడి ఉత్కంఠభరితమైన జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు సాధర ఆహ్వానం పలుకుతాయి.
మయూర్భంజ్లో ఉన్న ఈ ఉద్యానవనం ఒకప్పుడు ప్రావిన్స్ పాలకుల వేటగాళ్లుకు గమ్యస్థానంగా ఉండేది. ఇది ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటిగా నిలిచింది. దట్టమైన అడవులు, జలపాతాలు, మరియు అద్భుతమైన పచ్చికభూములు కలిగి, గొప్ప జీవవైవిధ్యంతో మంచి గుర్తింపు పొందింది. దాదాపు 96 రకాల ఆర్కిడ్లకు నిలయంగా విరాజిల్లుతోంది.

అనుభూతిని మాటల్లో చెప్పడం కాస్త కష్టమే..
సిమ్లిపాల్ జాతీయ ఉద్యానవనానికి చేరుకున్న తర్వాత పర్యాటకులు ఫారెస్ట్ రెస్ట్ హౌస్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మొత్తం అడవి అందాలను ఆస్వాదించేందుకు జీప్ సఫారీని అద్దెకు తీసుకోవచ్చు. అందమైన క్రూరమృగాలను దగ్గరగా చూసే సమయంలో కలిగే అనుభూతిని మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. అలా విహరిస్తూ దోబూచులాడే అనేక జంతువులను చూసే అవకాశం ఉంది. ఈ ఉద్యానవనంలో పులులు, ఏనుగులు మరియు కొండ మైనాకు నిలయంగా చెప్పవచ్చు.
ఇది ఒడిశా రాష్ట్రంలో అత్యధిక పులుల సంతతిని కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు నిత్యం వారి కెమారాలు, సెల్ ఫోన్లలో ఇక్కడి చిత్రాలను బంధించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ ప్రదేశంలోని స్థానిక వంటకాలను ఆస్వాదించడానికి సమీపంలో రెస్టారెంట్ కూడా ఉంది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలమనే చెప్పాలి.

ఎలా చేరుకోవాలి?
ఇక్కడికి చేరుకునేందుకు అన్ని ప్రధాన నగరాలనుంచీ కనెక్ట్విటి ఉంది. ఇక్కడికి సమీపంలోని దేశీయ విమానాశ్రయం జంషెడ్పూర్లో ఉంది. అక్కడినుంచి సిమ్లిపాల్ సుమారు మూడు గంటల ప్రయాణం ఉంటుంది. సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సిమ్లిపాల్ నుండి సుమారు ఐదు గంటల ప్రయాణం ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ బాలాసోర్ రైల్వే స్టేషన్. ఇది సిమ్లిపాల్ నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మిడ్నాపూర్, రూర్కెలా, కోల్కతా, సంబల్పూర్, హైదరాబాద్ మొదలైన అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.



Click it and Unblock the Notifications












