నవరాత్రులకు ముందే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సూరత్ - ఉదయ్పూర్ మధ్య నడిచే కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్లు 26903/26904) సర్వీసుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. వారానికి ఆరు రోజులు నడిచే ఈ రైలుకు సంబంధించిన కమర్షియల్ నోటిఫికేషన్ను, ప్రారంభ తేదీని వెస్ట్రన్ రైల్వే త్వరలోనే వెల్లడించనుంది. మరోవైపు, ప్రస్తుతం నడుస్తున్న ఉదయ్పూర్ సిటీ - అసార్వా వందే భారత్ (26963/26964) సర్వీసును నిలిపివేసి, దాని రేక్ను ఈ కొత్త మార్గానికి కేటాయించారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య వారాంతపు ప్రయాణాలకు ఇది ఎంతో వేగవంతమైన, ప్రీమియం ఆప్షన్గా మారనుంది.
ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు ఉదయం 6:10 గంటలకు సూరత్లో బయల్దేరి, మధ్యాహ్నం 1:40 గంటలకు ఉదయ్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:35 గంటలకు ఉదయ్పూర్లో బయల్దేరి, రాత్రి 11:00 గంటలకు సూరత్ చేరుకుంటుంది. ఈ మార్గంలో భరూచ్, వడోదర, ఆనంద్, మణినగర్, అసార్వా, హిమ్మత్నగర్, శ్యామ్లాజీ రోడ్, దుంగార్పూర్, జావార్ స్టేషన్లలో కమర్షియల్ స్టాప్లు ఉంటాయి. వారానికి ఆరు రోజులు నడిచే ఈ రైలు, బహుశా మంగళవారం రోజున సర్వీస్ అందించకపోవచ్చు. తక్కువ దూరమున్న అసార్వా రూట్ స్థానంలో వచ్చిన ఈ కొత్త సర్వీస్తో దక్షిణ గుజరాత్కు కనెక్టివిటీ మరింత పెరగనుంది.

సూరత్ - ఉదయ్పూర్ వందే భారత్ స్టాప్లు, టైమింగ్స్ ఇవే..
వెస్ట్రన్ రైల్వే సమాచారం ప్రకారం.. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ (ప్రైమరీ మెయింటెనెన్స్) సూరత్లోనే జరుగుతుంది. ప్రయాణంలో భాగంగా వడోదర, అసార్వాల్లో నీటి సదుపాయం (వాటరింగ్) కల్పిస్తారు. ఈ ప్రయాణానికి దాదాపు ఏడున్నర గంటల సమయం పడుతుంది. ఉదయ్పూర్ టూర్ ప్లాన్ చేసుకునే వారికి, శ్యామ్లాజీ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ఈ టైమింగ్స్ ఎంతో అనుకూలంగా ఉంటాయి. పర్యాటకులకు ఉపయోగపడేలా వేళలను ఖరారు చేయడంపై గుజరాత్ టూరిజం అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
టికెట్ బుకింగ్స్, ఛార్జీలు, ప్రయాణికులకు టిప్స్
వెస్ట్రన్ రైల్వే టైమ్టేబుల్ను సిస్టమ్లో అప్లోడ్ చేయగానే IRCTC యాప్ లేదా వెబ్సైట్లో 26903/26904 రైలు వివరాలు అందుబాటులోకి వస్తాయి. బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకోవడానికి ixigo యాప్లో 'Booking Alert' సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్రత్యామ్నాయ ప్రయాణ ఆప్షన్ల కోసం ConfirmTkt ప్రిడిక్షన్లను చూడొచ్చు. ఒకవేళ టికెట్ బుక్ చేసేటప్పుడు భోజనం వద్దని ఎంచుకున్నా (Opt-out), టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ఐఆర్సిటిసి పంపే ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా ఆ తర్వాత కూడా మీల్స్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
టికెట్ ఛార్జీల విషయానికొస్తే.. అహ్మదాబాద్ - ముంబై వందే భారత్ మార్గంలో ఏసీ ఛైర్ కార్ ఛార్జీ రూ.1,365, ఎగ్జిక్యూటివ్ ఛార్జీ రూ.2,485 వరకు ఉంది. సాధారణంగా వందే భారత్ ఛైర్ కార్ ఛార్జీలు శతాబ్ది ప్రాథమిక రేట్ల కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. ఐఆర్సిటిసి అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, సూరత్ - ఉదయ్పూర్ వందే భారత్ ఛార్జీలు ఛైర్ కార్ (CC)కి రూ.1,500 నుంచి రూ.1,900 వరకు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC)కి రూ.2,800 నుంచి రూ.3,200 మధ్య ఉండే అవకాశం ఉంది. తొలి వారంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ లగేజీతో ప్రయాణించడం, రైల్వే యాప్స్లో ప్లాట్ఫామ్ నంబర్ ముందే సరిచూసుకోవడం మంచిది.
ముంబై నుంచి వచ్చే విమాన ప్రయాణికులు రాత్రి సూరత్ చేరుకుని, మరుసటి రోజు ఉదయం ఉదయ్పూర్ రైలు ఎక్కవచ్చు. మళ్లీ తిరుగు ప్రయాణంలో రాత్రి సూరత్ చేరుకుని తర్వాతి రోజు ఉదయం ఫ్లైట్లో వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నుంచి వచ్చేవారు సూరత్కు సాయంత్రం వేళల్లో ఫ్లైట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా వడోదర లేదా అసార్వాలకు కనెక్టివిటీ పొందవచ్చు. శ్యామ్లాజీ భక్తులకు, హిమ్మత్నగర్ రోజూ ప్రయాణించే ఉద్యోగులకు ఈ ప్రీమియం డే-టైమ్ రైలు సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.



Click it and Unblock the Notifications











