ఈ సీజన్లో స్నేహితులతో కలిసి సరదాగా గోవా ట్రిప్కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యంతోపాటు అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక నిర్మాణాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి మరి. అయితే, చాలామంది గోవా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుని, ఎక్కడెక్కక్కడికి వెళ్లాలి, ఏమేం చూడాలి అనే సందిగ్ధంలో టూర్ ప్రోగ్రాం ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం శాఖ ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్.. గోవా అందాలను ఆస్వాదించి, మళ్లీ భాగ్యనగరంలో అడుగుపెట్టడంతో ముగుస్తుంది. వింటుంటేనే ఎప్పుడెప్పుడు ఈ ప్యాకేజీలో గోవాలో అడుగుపెట్టేద్దాం అనిపిస్తుంది కదూ! అందుకే.. తెలంగాణ టూరిజం శాఖ అందిస్తోన్న ఆ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు మీకోసం
తెలంగాణ టూరిజం శాఖ గోవా ప్యాకేజ్ టూర్- ఇటెనరరీ పేరుతో సరికొత్త ట్రిప్ను అందిస్తోంది. ఈ టూర్ భాగ్యనగరం హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయబడుతోంది. మొత్తం నాలుగు రోజుల పాటు సాగే ఈ జర్నీలో ఏయే ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది? టఇటికెట్ ధర ఎలా ఉంటుంది? ఎక్కడ స్టే చేయాలి? లాంటి వివరాలను పరిశీలిస్తే.. మొదటిరోజు భాగ్యనగరంలోని బషీర్బాగ్ నుంచి మధ్యాహ్నాం రెండు గంటలకు గోవా ట్రిప్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం చేసి, రెండవ రోజు ఉదయం 6 గంటలకు కలంగుట్ చేరుకుంటారు. అధికారులు ముందుగానే అక్కడ హోటల్ రూం బుక్ చేస్తారు. అక్కడే చెకిన్ అయిన తర్వాత గోవా పర్యటకు బయటకు తీసుకువెళతారు.
పాన్జిమ్లోని క్రూజ్బోట్లో..
ముందుగా నార్త్ గోవాలో ఉన్న మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్ అగుడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్ లాంటి సందర్శనీయ ప్రదేశాలను చూపిస్తారు. అక్కడి విశేషాలను తెలిపేందుకు గైడ్ కూడా ఉంటారు. అక్కడి నుంచి హోటల్కు చేరుకుని, రాత్రికి అక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. మూడవ రోజు ఉదయం సౌత్ గోవా సందర్శనకు తీసువెళతారు. సౌత్ గోవాలో డోనా పౌలా బీచ్, మిరామార్ (గాస్పర్ డయాస్ బీచ్), ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ అందాలను ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్ర సమయంలో పాన్జిమ్లోని క్రూజ్బోట్లో ప్రయాణం ఏర్పాటు చేస్తారు. అలా రాత్రికి తిరిగి కలంగుట్ చేరుకుని, అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

చివరి రోజు ఉదయం తిరుగు ప్రయాణంలో భాగంగా 11 గంటలకు కలంగుట్ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంటుంది. అలా ఐదో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్కు చేరుకోవడంతో గోవా టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల వివరాలు ఇలా..
ఈ ప్యాకేజీ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. పెద్దలకు ఒక్కొక్కరికీ ధర రూ. 11,999గా, పిల్లలకు రూ. 9599గా ఉన్నాయి. అలాగే, సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 14,900 చెల్లించుకోవాల్సి ఉంటుంది. హోటల్, భోజనం ఛార్జీలు లాంటివి ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. అయితే, పాన్జిమ్లో క్రూజ్ బోట్ జర్నీకి మాత్రం ప్రయాణికులే సొంతంగా డబ్బులు చెల్లించుకోవాలి. వారంలో ప్రతి సోమవారం ఈ గోవా టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. టూర్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications














