రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఈ సీజన్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసేవాళ్లు తప్పకుండా తెలంగాణలోని ఓ జలపాతానికి వెళ్లాల్సిందే. ఈ జలపాతం సహజ సిద్దంగా ఏర్పడినది. అయితే ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టని అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. ఇంతకీ ఈ జలపాతం ఏంటని అనుకుంటున్నారా..?
అదే భీముని పాద జలపాతం. ఈ జలపాతంలోని 70 అడుగుల ఎత్తు నుండి జాలు వారే జలాధార పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉంది. పంచపాండవుల్లో ఒకడైన భీముని పేరు మీదుగా ఈ జలపాతానికి పేరు వచ్చింది. వర్షాకాలంలో ఈ జలపాతం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది.
ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చని అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడి సూర్యాస్తమయ దృష్యాలు తప్పకుండా చూడాల్సిందే. ఈ జలపాతం చూడటానికి చిన్నగా కనిపించినా, చుట్టూ ఉన్న అడవి పర్యాటకులను మైమరింపజేస్తాయి. భీమునిపాదం జలపాతం ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఆ జలపాతపు సవ్వడులు తప్ప మరే శబ్దాలు వినిపించవు. ఈ ప్రాంతానికి అనేక పురాణగాథలు ఉన్నాయి. అందులో ఒకటి.

రెండు గుట్టల మధ్య ఉండే ఈ ప్రాంతంలో యాదవులు ఎక్కువగా ఉండేవారని, అయితే, ప్రతి వేసవిలో వేడికి కాలిపోతున్న తమ నివాసాలను చూసి యాదవులు చేసిన ఆర్తనాదాలు విన్న భీముడు వారిని రక్షించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. భీముడి అడుగువేయడంతో వచ్చిన నీటితో ఈ ప్రాంతం జలపాతంగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు. అలా భీముడి పాదంగా ఈ ప్రదేశానికి పేరు వచ్చింది. కొండల్లో నుంచి దూకే ఈ జలపాతం కేవలం ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను పర్యాటకులకు అందిస్తోంది.
ఇదే అదనపు ఆకర్షణ..
ఈ జలపాతానికి సమీపంలో పది కిలోమీటర్ల పొడవైన ఓ గుహ ఉంది. ఇదే ఇక్కడి అదనపు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ గుహ ఇక్కడికి సమీపంలోని బల్లకొండ ఆలయం వరకూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. పూర్వం ఇక్కడ తపస్సు చేసే బుుషులు ఈ గుహమార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించేవారట. ఈ జలపాతం దారిలో పచ్చని చెట్లు, చిన్న పిల్ల కాల్వలతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భీముని జలపాతం సమీపంలో చినన చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.
అందులో శివుడు, నాగదేవత విగ్రహలు ఉన్నాయి. నిత్యం ఇక్కడి స్థానికులు పూజలు చేస్తుంటారు. ఈ ప్రదేశమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏ కాస్త వీలు చిక్కినా చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా ఇక్కడకు వచ్చి కాసేపు రిలాక్స్ అవుతుంటారు. మరికొందరేమో కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రశాంతమైన పచ్చని అందాల మధ్య కాసేపు సేదతీరితే మనసు ఎంతో పులకరిస్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమనే చెప్పాలి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి తరించడానికి వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు
ఎలా చేరుకోవాలి..?
ఈ జలపాతాన్ని చేరుకోవడానికే అనేక మార్గాలున్నాయి. వరంగల్ నుంచి భీమునిపాదం చేరుకోవాలంటే సుమారు 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడినుండి భూపతిపేట దగ్గర ఎడమవైపు తిరిగి, చిన్న ఎల్లాపురం మీదుగా భీముని పాదం చేరుకోవచ్చు. ఇక, ఖమ్మం నుంచి అయితే సుమారు 88 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి అయితే, 200 కిలోమీటర్ల జర్నీ చేయాలి.
సిటి నుంచి ముందుగా భూపతిపేట్కి చేరుకుని, అక్కడి నుండి రెండు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే..కొమ్ముల వంచ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భీముని పాద జలపాతానికి చేరుకోవచ్చు. పర్యాటకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉండడానికి వసతుల్లేవు. మరెందుకాలస్యం ఈ సీజన్లో భీముని పాదం జలపాతం అందాలు చూసేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మరి..



Click it and Unblock the Notifications












