వర్షాకాలంలో అందమైన ప్రదేశాలు చూడాలనుకుంటున్నారా..? అయితే, ఒడిశాలోని భితార్కనిక నేషనల్ పార్క్కు వెళ్లాల్సిందే.. ఈ సీజన్లో ఈ పార్క్ అందం మరింత రెట్టింపవుతుంది. భితార్కనికా నేషనల్ పార్క్ వర్షాకాలంలో సజీవంగా ఉండే ఒక రహస్య రత్నం వంటిది. ఈ పార్క్ దట్టమైన మడ అడవులు, విభిన్న వన్యప్రాణులకు పేరుగాంచింది. ఈ పార్క్ ప్రకృతి ఔత్సాహికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలు ఈ పార్క్ సొంతం..
భితార్కనిక నేషనల్ పార్క్ ఒడిషాలోని కేంద్రపారా జిల్లాలో ఉంటుంది. ఇది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనంగా ప్రసిద్ధిచెందింది. 2002 ఆగస్టులో ఈ పార్క్ రామ్సర్ సైట్ హోదాను దక్కించుకుంది. చిలికా సరస్సు తర్వాత రామ్సర్ సైట్ అనే అరుదైన హోదాను దక్కించుకున్న రెండో ప్రదేశం భితార్కనిక నేషనల్ పార్క్. దీంతో ఇదోక ప్రత్యేకమైన జాతీయ ఉద్యావనంగా పేరుగాంచింది. ఈ పార్క్ చుట్టూ 672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భితార్కనిక వన్యప్రాణుల అభయారణ్యం కూడా నెలకొని ఉంది. ఈ అభయారణ్యంతో పాటు ఇక్కడ మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి.
అందులో గహిర్మాత బీచ్ సముద్ర అభయారణ్యం, అరుదైన మడ అడవులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్నాయి. అయితే, ఈ పార్క్, ఈ వన్యప్రాణుల అభయారణ్యం బ్రాహ్మణి, వైతరణి, ధమ్రా, పాత్సాలా అనే నదుల కారణంగా ముంపుకు గురయ్యాయి. ఈ ప్రాంతం దేశంలోనే రెండో అతి పెద్ద మడ అడవులు కలిగిన పర్యవరణ ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది.

215 జాతులకు చెందిన పక్షులు...
ఈ ఉద్యానవనంలో ఉప్పునీటి మొసళ్ళు, భారతీయ కొండచిలువలు మరియు తెల్ల మొసళ్ళతో సహా అనేక రకాల జాతులు ఉన్నాయి. భారతీయ కొండచిలువలు, కింగ్ కోబ్రాలతో పాటు దాదాపు 215 జాతులకు చెందిన పక్షులకు ఈ ఉద్యానవనం నిలయంగా ఉంది. దీంతో ఇదో అరుదైన జాతీయ ఉద్యానవనంగా పేరుగాంచింది. పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఇక్కడికి అనేక వలస పక్షులు వస్తాయి. వాటిని చూసి ఆనందించవచ్చు. రుతుపవనాల రాకతో ఈ పార్క్ అందం మరింత రెట్టింపవుతుంది. ఇది ఒక సుందరమైన గమ్యస్థానంగా మార్పు చెందింది.

గహిర్మాత బీచ్ మెరైన్ అభయారణ్యం..
ఈ జాతీయ ఉద్యానవనం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గహిర్మాత బీచ్ మెరైన్ అభయారణ్యం ఉంటుంది. ఇందులో ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గూడు ఉంటుంది. ఇవి అంతరించిపోతున్న తాబేళ్ల జాతి. ఈ తాబేళ్లు ఏటా శీతాకాలంలో గహిర్మాత బీచ్కు వచ్చి గుడ్లు పొదిగి మళ్లీ ఫిబ్రవరి నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో సముద్రంలోకి వెళ్లిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఈ దృశ్యం చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది దీనిని చూసేందుకే ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. వర్షాకాలంలో ఈ పార్క్ను సందర్శించడం అంటే దాని గొప్ప జీవవైవిధ్యాన్ని దగ్గరగా చూసే అవకాశాన్ని పొందండం. సందర్శకులు మడ అడవుల గుండా బోట్ రైడ్ చేసే వీలుకూడా ఉంటుంది.

ఇతర జాతులకు నిలయం...
ఈ ఉద్యానవనం ఉప్పునీటి మొసళ్ల జనాభాకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇవి తరచుగా నది ఒడ్డున లేదా క్రీక్స్లో ఈత కొడుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి. ఇక్కడి సరీసృపాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇంకా ఇక్కడ అదనంగా బితార్కనికా మచ్చల జింకలు, అడవి పందులు, రీసస్ కోతులు వంటి అనేక ఇతర జాతులు ఉంటాయి. ఈ ఉద్యానవనం కింగ్ఫిషర్లు, ఎగ్రెట్స్ మరియు హెరాన్ల వంటి వలస పక్షులకు స్వర్గధామమని చెప్పుకోవాలి. పచ్చని చెట్ల మధ్య ఈ పక్షుల దృశ్యం నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications













