మన దేశంలో పురాతన దేవాలయాలకు కొదవే లేదు. ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ కొన్ని ఆలయాలు నిర్మాణశైలితో ఆకర్షిస్తే.. మరికొన్ని వాటి చారిత్రక నేపథ్యంతో సందర్శకులను వాటివైపు తిప్పుకుంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ దేవాలయం తలుపులు సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటాయి. ఆ ఒక్కరోజులోనే ధూప, దీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అలా పూజలు అందుకుంటున్న ఆ దేవుని ప్రత్యేకతలేంటి? సంవత్సరంలో ఏ రోజున ఆ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి? ఆలయ చారిత్రక నేపథ్యం ఏంటి? తెలుసుకుందామా?!
మనం చెప్పుకోబోతోన్న ఈ ప్రత్యేకమైన ఆలయం మధ్యప్రదేశ్లోని భూపాల్కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సోమేశ్వర ఆలయంగా పిలుస్తారు. దశాబ్దాలుగా మూసివేసిన ఈ ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు శివాలయాలకు కుటుంబ సమేతంగా భక్తలు తరలివస్తూ ఉంటారు.

రాజవంశీయులు ఆధీనంలో..
సుమారు 1000 అడుగుల ఎత్తయిన కొండపైన ఈ ఆలయాన్ని పదవ శతాబ్ధంలో నిర్మించారు. పూర్తి రాతి నిర్మాణం అయినప్పటికీ ఆ నిర్మాణ శైలి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అనంతరం మాలిక్ కపూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు ఈ సోమేశ్వర ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. 1543లో షేర్షా సూరి చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో సోమేశ్వరాలయం రాజవంశీయులు ఆధీనంలో ఉండసాగింది. కేవలం వారి వంశీయులు మినహా సామాన్య ప్రజలకు ఆలయ ప్రవేశం కూడా ఉండేది కాదు.

పురావస్తు శాఖ నిర్వహణలో..
అయితే, 1974 సమయంలో సామాన్య ప్రజల కోసం ఈ దేవాలయాన్ని తెరవాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసివేసిన సోమేశ్వర ఆలయ ద్వారాలు తెరచి.. సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే పురాతన ఆలయం, అదికూడా చారిత్రక నేపథ్యం ఉండడంతో భక్తలకు కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేలా అనుమతించారు. నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తోంది.
పూజలు, ధూప, దీప.. నైవేద్యాలు..
అధికారుల సమక్షంలో మహా శివరాత్రి రోజున 12 గంటల పాటు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు. ఏడాది మొత్తం దొరికే ఆ ఒక్కరోజు కోసం శివభక్తలు శివరాత్రి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కుటుంబసమేతంగా ఆ మహాశివుని దర్శించుకునేందుకు బయలుదేరుతారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పూజలు, ధూప, దీప.. నైవేద్యాలు సమర్పిస్తుంటారు. టెంకాయ, పండ్లు లాంటివి తెచ్చి స్వామి వారికి నివేదన పెడతారు. శివరాత్రి సమీపిస్తున్న వేళ భక్తల కోరిత మరికొన్ని రోజుల్లో తీరబోతోంది.



Click it and Unblock the Notifications













