చీనాబ్ నదిపై ముస్తాబవుతున్నప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెన గురించి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.. ఈ రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించినది. ప్రస్తుతం దీని నిర్మాణం పూర్తయ్యింది. త్వరలోనే ఈ బ్రిడ్జ్పై సింగిల్ రూట్ ట్రైన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిన్న (ఆదివారం) ఈ రైలు వంతనపై ట్రయల్ రన్ కూడా ప్రారంభమయ్యింది.
భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ప్రస్తుతం మన దేశంలోని రైళ్లు కన్యాకుమారి నుంచి కత్రా వరకు ప్రయాణిస్తున్నాయి. కాశ్మీర్ లోయలో బారాముల్లా, సంగల్దాన్ మధ్య రైల్వే సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. చీనాబ్ రైలు వంతెనపై రైలు సేవలు ప్రారంభమైన తర్వాత, జమ్మూ, కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ రియాసి జిల్లాలోని కత్రా దేశంలోని మిగిలిన రైల్వే నెట్వర్క్కు జోడించబడ్డాయి. ఇక, ఇప్పడు ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెన త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులో రానుంది. నిన్న (జూన్ 16న ) ఈ ట్రైన్ ట్రయల్ రన్ కూడా పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా సోషల్మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈఫిల్ టవర్ కంటే ఎత్తయినది..
చీనాబ్ రైలు వంతెన జమ్మూ మరియు కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించబడినది. ఇది సుమారు 359 మీటర్ల (సుమారు 109 అడుగులు) ఎత్తులో ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉంటుంది. ఈ రైల్వే వంతెన పారిస్ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెన ఎత్తు కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణం 2004లో ప్రారంభమైంది. అంటే వంతెన నిర్మాణానికి సుమారు రెండు దశాబ్దాలు పట్టింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఈ వంతెనను నిర్మించింది. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ. 1400 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

వంపు ఆకారంలో...
చీనాబ్ వంతెన నిర్మాణంలో సుమారు 30,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ వంతెన వంపు ఆకారంలో నిర్మించబడింది. దీని రూపకల్పన నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. ఇది కనీసం రాబోయే 120 సంవత్సరాల వరకు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ వంతెనను కనెక్ట్ చేసేందుకు ప్రపంచ స్థాయి వెల్డింగ్ ఉపయోగించబడింది. ఈ వంతెన మొత్తం 18 కాంక్రీట్ స్తంభాలపై నిర్మించబడింది. జమ్మూలో ఈ వంతెన నిర్మించిన ప్రదేశం భూకంప జోన్ IVలో ఉందని అధికారులు అంటున్నారు.

అయితే ఇది భూకంప జోన్ V కోసం రూపొందించబడినట్లు తెలుస్తోంంది. అంటే రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. 260 కిలోమీటర్ల వేగంతో వచ్చే తుపానును సైతం ఈ వంతెన తట్టుకుని దృఢంగా నిలుస్తుందని అధికారులు అంటున్నారు. కాశ్మీర్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను చాలా బలంగా తయారు చేయడం జరిగింది. ఇది -10 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే సామర్థ్యం దీనికుంది.



Click it and Unblock the Notifications











