పర్యావరణంలో భాగమైన నింగి, నేల, నీరు, గాలి ఇలా ప్రతి ఒక్కటి ఈ నేలపై దైవంతో సమానం. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్న మన దేశంలో వినాయకుని వాహనంగా హిందువులు మూషికాన్ని(ఎలుక) పూజిస్తారు. అంతేకాదు, వివిధ జంతువులకు, పక్షులకు ఆలయాలను కూడా నిర్మించి, దైవంగా కొలవడం మన దేశంలో ఆనవాయితీగా ఉంది. అయితే, ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఓ అరుదైన ఆలయం ఇక్కడ ఉంది. అదే.. కర్ణి మాత ఆలయం. ఇది ఎలుకల ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని.. ఆ పురాతన ఆలయ విశేషాలను తెలుసుకుందాం పదండి!
రాజస్థాన్ రాష్ట్రం దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం వినాయక చతుర్థి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిస్తుంది. ఇందుకు కారణం ఇది ప్రపంచంలోనే ఎలుకల కోసం ఉన్న ఒకేఒక్క దేవాలయం కావడమే. ఈ ఆలయంలో అడుగుపెడితే చాలు వేలాది ఎలుకలు సందడి చేస్తూ కనిపిస్తాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇక్కడ 20 వేలకి పైగా నలుపు, తెలుపు ఎలుకలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెల్లని ఎలుకుల ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కబ్బాగా పిలుచుకునే ఈ ఎలుకలను ఆలయానికి వచ్చే భక్తులు పవిత్రమైన దైవంగా భావిస్తూ.. పూజలు నిర్వహిస్తారు.

కర్ణిమాత నడియాడిన నేల..
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా పురాణం ప్రకారం., ఒకప్పుడు కర్ణి మాత సవతి కుమారుడు లక్ష్మణుడు కొలయత్ తహసీల్లోని కపిల్ సరోవర్ అనే చెరువులో నీరు తాగేందుకు వెళ్లి, అందులో మునిగిపోయాడు. దీంతో కర్ణి మాత మృత్యు దేవుడైన యమడిని ప్రార్థించి, కుమారుడి ప్రాణాలను అడిగారట.
అందుకు యముడు నిరాకరించాడు. ఆ తర్వాత కర్ణిమాతకు పుట్టే మగ పిల్లందరూ ఎలుకలుగా పుట్టడానికి అనుమతిస్తాడు. అలా ఈ ప్రాంతం కర్ణిమాత నడియాడిన నేలగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ఎలుకల సంతతికి అంతటి చారిత్రక నేపథ్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు.

పౌరాణిక, జానపద కథలు..
ఇక్కడ ఆలయాన్ని 19వ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించడం ప్రారంభించారు. ఇది మొఘల్ శైలిలో పాలరాతితో రూపొందించిన నిర్మాణం. అయితే, 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఎలుకలను దర్శించుకుని, పూజలు చేస్తారు. ఆలయం పౌరాణిక, జానపద కథలకు చాలా ఎంతో ప్రసిద్ధి పొందింది.
పొరపాటున ఎలుకను చంపినట్లయితే, దాని స్థానంలో వెండి ఎలుకను ఆలయంలో అందించాలని కూడా ప్రచారంలో ఉంది. కర్ణి దేవత ఆశీర్వాద ప్రభావం తమ జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, ఏటా వినాయక చతుర్థి సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కర్ణి మాత ఆలయానికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఉంది. బికనీర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్కి చేరుకునేందుకు నిత్యం బస్సు, రైలు, టాక్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












