తిరువరప్ప ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఆకలికి ఆగలేదట..!
జన్మాష్టమి పండుగ భారతీయ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడింది. పురాతన కాలం నుండి, శ్రీ కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజును జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. కానీ దక్షిణ భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన శ్రీకృష్ణుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఆలయంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడి విగ్రహం ఆకలితో బాధపడుతుందట! అందుకే ప్రత్యేకంగా స్వామివారికోసం రోజుకి పదిసార్లు నైవేద్యం పెడతారట.. అలా పెట్టకపోతే శ్రీకృష్ణుని విగ్రహం బలహీనపడుతుందట..రండి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ వింత ఆలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ ఆలయ చరిత్ర..
ప్రస్తుతం కేరళలో ఉన్న మిస్టరీ కృష్ణ దేవాలయం పేరు తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం. ఇది కొట్టాయం జిల్లాలోని తిరువెర్పులో ఉంది. శ్రీ కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయాన్ని చూసేందుకు ఇక్కడికి స్థానిక ప్రజలే కాకుండా దేశంలోని నుండి భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం చరిత్ర చాలా ప్రత్యేకమైనది, ఎంతో ఆసక్తికరమైనది కూడా. ఈ దేవాలయం సుమారు 1500 సంవత్సరాల నాటిది. పురాతన కాలం నుండి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా, రహస్యంగా ఉంది.

కేవలం రెండు నిమిషాలు మాత్రమే..
తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు రెండు నిమిషాలు మాత్రమే నిద్రపోతాడట. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఆలయ తాళం చెవులను పూజారి వద్దే ఉంటాయి. తాళపుచెవులతో పాటు ఓ గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోతే.. తలుపులు తెరవడానికి గొడ్డలిని ఉపయోగంచి పగలగొట్టవచ్చు.. ఈ విషయంలో పూజారికి పూర్తి అనుమతి ఉంది. వందల ఏళ్లుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు ఇక్కడివారు.
ఆలయ పురాణం గురించి..
ఆలయ పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూజించేవారని ప్రతీతి. పాండవులు ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించి, దేవునికి ఆహారం సమర్పించేవారు. పాండవులు అజ్ఞాతవాసం నుండి తిరిగి రావడం ప్రారంభించినప్పుడు, వారు తిరువరప్పులో విగ్రహాన్ని విడిచిపెట్టారు. పాండవులు నిష్క్రమించిన తరువాత, స్థానిక మత్స్యకారులు ఈ విగ్రహాన్ని పూజించారు. అప్పటినుంచి క్రమంగా ఈ ఆలయానికి ప్రజాదరణ పెరగడం ప్రారంభమైందని ఇక్కడి వారు చెబుతున్నారు.

శ్రీ కృష్ణుడి విగ్రహం బలహీనపడుతుందా?
ఆ ఆలయంలో ప్రతిష్టించిన కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోలేదట. అందుకే ప్రత్యేకంగా ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. అలా శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టిన ప్లేట్లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. కృష్ణుడు తన మేనమామ కంసుడిని సంహరించాక చాలా ఆకలితో ఉన్నాడని.. అదే విధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా సరే, విగ్రహం స్వయంచాలకంగా సన్నబడుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.
గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది..
సాధారణంగా ఏ ఆలయమైనా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయాల్లో మూసి వేస్తారు. కానీ ఈ క్రిష్టుడి ఆలయాన్ని మాత్రం గ్రహణం వచ్చినా మూయరు. ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచుతారు. గ్రహణ సమయంలో కూడా శ్రీకృష్ణుడి విగ్రహానికి నైవేద్యం పెడతారు.



Click it and Unblock the Notifications












