ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఇవే..
ఒడిశా రాష్ట్రం గొప్ప సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని కలిగి ఉండడమే కాకుండా ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం, అడవులు, పర్వతాలు మరియు అనేక రకాల చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పర్యాటకులకు వైవిధ్యమైన మరియు ఆసక్తికరమైన గమ్యస్థానంగా మారాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నుండి సహజమైన బీచ్ల వరకు, ఒడిషాలో అన్వేషించడానికి ఆసక్తికరమైన ప్రదేశాలకు కొరత లేదు. మరెందుకాలస్యం ఈ సెలవుల్లో పిల్లలతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

కోణార్క్ సూర్య దేవాలయం
కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని పూరిలో భారతదేశ తూర్పు తీరంలో ఉంది. ఇది రాజధాని భువనేశ్వర్ నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దాని సున్నితమైన వాస్తుశిల్పం, క్లిష్టమైన రాతిశిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సూర్యదేవునికి అంకితం చేయబడింది. దీనిని సూర్యుడు అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. అద్భుతంగా చెక్కబడిన చక్రాలు మరియు దూకుతున్న గుర్రాలు ఉన్నాయి. ఈ ఆలయ వాస్తుశిల్పం కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ.

జగన్నాథ దేవాలయం
పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ర్టంలోని బంగాళాఖాతంలో తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఈ ప్రాంతం ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవానికి కూడా వేదిక.

చిలికా సరస్సు
చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయా నది ముఖద్వారం వద్ద ఒడిశా రాష్ర్టంలోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాలో విస్తరించి ఉంది. ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఇది ప్రసిద్ధి చెందింది. దీని విస్తీర్ణం 1,100 చదరపు కిలోమీటర్ల పైచిలుకు ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద తీరప్రాంత సరస్సు. చిలికా సరస్సు పక్షి వీక్షకులకు మరియు ప్రకృతి ఔత్సాహికులకు స్వర్గధామం. ఫ్లెమింగోలు, పెలికాన్లు మరియు హెరాన్లతో సహా వివిధ రకాల పక్షి జాతులకు ఈ సరస్సు నిలయం.

లింగరాజు దేవాలయం
భువనేశ్వర్లోని పురాతన దేవాలయాలలో లింగరాజు దేవాలయం ఒకటి. అంతేకాకుండా నగరంలో అతిపెద్ద దేవాలయంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. లింగరాజ్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ప్రముఖ హిందూ దేవాలయం. ఇది కళింగ మరియు ద్రావిడ నిర్మాణ శైలుల యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో జజాతి కేశరి రాజు నిర్మించారు. ఈ దేవాలయంలో లింగం, శివుని స్వరూపం, సహజంగా కనిపిస్తుందని ఇక్కడికి విచ్చేసే భక్తులు, పర్యాటకులు ఎంతగానో నమ్ముతారు.

ఉదయగిరి మరియు ఖండగిరి గుహలు
ఉదయగిరి మరియు ఖండగిరి గుహలను గతంలో కటక గుహలు లేదా కటక్ గుహల్ అని పిలిచేవారు. భారతదేశంలోని ఒడిశాలోని భువనేశ్వర్ నగరానికి సమీపంలో ఉన్న పురావస్తు, చారిత్రక గుహలలో ఒకటి. వీటిని శాసనాలలో లేనా లేదా లేణా అని పిలుస్తారు. ఈ పురాతన రాక్-కట్ గుహలు 2వ శతాబ్దం BC నాటివి. అంతేకాకుండా, జైన సన్యాసులచే నివాస స్థలాలుగా ఉపయోగించబడ్డాయి. ఈ గుహలలో విస్తృతమైన చెక్కడాలు మరియు శాసనాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications













