తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమైన వాహన సేవల రోజుల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండే అవకాశముంది. సెప్టెంబర్ 19న (శనివారం) సాయంత్రం అత్యంత కీలకమైన గరుడ సేవ, సెప్టెంబర్ 22న (మంగళవారం) ఉదయం రథోత్సవం జరగనున్నాయి. ఇక సెప్టెంబర్ 23న (బుధవారం) ఉదయం చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. మరోవైపు, ఈరోజు (సెప్టెంబర్ 16) తిరుపతిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం నాటికి వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కాబట్టి సాయంత్రం వేళల్లో వాహన సేవలు చూడటానికి వెళ్లే భక్తులు గొడుగులు సిద్ధం చేసుకోవడమే కాకుండా, కాస్త ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దర్శనం వేళల్లో టీటీడీ పలు మార్పులు చేసింది. ఆర్జిత సేవలతో పాటు వయోవృద్ధులు, పసిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, దాతలు మరియు ప్రోటోకాల్ పరిధిలోకి రాని విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా పరిమితంగానే ఉన్నాయి. కొత్త టికెట్ల కోటా కోసం భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ లేదా యాప్ను మాత్రమే ఎప్పటికప్పుడు గమనించాలి. దళారులు, థర్డ్ పార్టీ ముసుగులో మోసగించే వారి మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్, వేళలివే..
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి వాహన సేవలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 19న ప్రసిద్ధ గరుడ సేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు సాగుతుంది. ఈ సమయంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊహించని రీతిలో భారీగా భక్తులు గుమిగూడుతారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22 ఉదయం రథోత్సవం, సెప్టెంబర్ 23 ఉదయాన్నే చక్రస్నానం వైభవంగా జరుగుతాయి. సెప్టెంబర్ 19న ఉండే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు ఆ రోజు సాయంత్రం గుంపుల్లోకి వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం.
ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు
గరుడ సేవను పురస్కరించుకుని రెండు ఘాట్ రోడ్లలోనూ సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించారు. కొండపైకి ప్రైవేట్ వాహనాలకు కూడా అధికారులు పరిమితి విధించారు. కాబట్టి భక్తులు తమ వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసి, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం మంచిది. సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు తమిళనాడు ఆర్టీసీ (TNSTC) రోజువారీగా 150 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దీనికి తోడు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కూడా అదనపు సర్వీసులను నడిపేందుకు సర్వసిద్ధంగా ఉంది. తిరుమల కొండపై ప్రయాణానికి ఉచిత రవాణా సౌకర్యమైన 'ధర్మ రథం' బస్సులను వాడుకోవచ్చు.
వాతావరణ పరిస్థితులు.. భక్తులకు ఉపయోగపడే సూచనలు
ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటం, అలాగే శనివారం నాటికి వాతావరణం మరింత ప్రతికూలంగా మారే సూచనలు ఉండటంతో.. భక్తులు రద్దీ లేని రోజుల్లో ఉదయాన్నే లేదా రాత్రి ఆలస్యంగా దర్శన వేళలను ఎంచుకోవడం మేలు. తిరుపతిని బేస్ పాయింట్గా చేసుకుని, బస చేసేందుకు వసతి గదులను ముందుగానే బుక్ చేసుకోండి. అలిపిరి నుంచి కొండపైకి నిరంతరం నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. తిరుమల పర్యటనలో మిగిలిన సమయంలో సమీపంలోని చంద్రగిరి కోట, తలకోన జలపాతం, శ్రీకాళహస్తి క్షేత్రాలను సందర్శించవచ్చు. నూతన దంపతులు లేదా జంటలు కొద్దిగా సమయం కేటాయించి మహాబలిపురం, పులికాట్ వంటి తీరప్రాంత ప్రాంతాలకూ వెళ్లవచ్చు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రాత్రి వేళల్లో కొండపై ప్రయాణాలను నివారించండి, వెంట గొడుగులను తప్పనిసరిగా ఉంచుకోండి.



Click it and Unblock the Notifications