పదిహేను వేల రూపాయలకే పూరి, కాశీ, అయోధ్యల ట్రిప్..
వేసవి సెలవులు ముగియనున్నాయి. కాబట్టి చాలామంది ఇంకా ఎక్కడికైనా వెళ్లాలి అనుకునేవాళ్లు వాళ్ల ప్రయత్నాలలో వాళ్లున్నారు. కొందరు జలపాతాలను సందర్శిస్తే మరికొందరేమో హిల్స్టేషన్లకు పరుగులెడుతున్నారు. కొంతమంది మాత్రం ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తున్నారు. మీరు కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటే మాత్రం ఐఆర్సిటిసి ఓ శుభవార్తను మీ ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య వెళ్లాలనుకునే వారికోసం ఐఆర్సిటిసి ఓ సరికొత్త ప్యాకేజీని పర్యాటకులకు అందించనుంది. ఇందులో భాగంగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్యాకేజీ జూన్ 28 నుంచి అందుబాటులోకి వస్తుంది. పుణ్యక్షేత్ర యాత్ర అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఐఆర్సిటిసి అందిస్తోంది. సికింద్రాబాద్ నుండి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఇది ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు కొనసాగుంది. ఇందులో భాగంగా గయా, వారణాసి, అయోధ్య, పూరి, ప్రయాగ్రాజ్ ప్రాంతాలను సందర్శించొచ్చు.

టూర్ ప్యాకేజీ ధర
భారత్ గౌరవ్ రైలులో మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉండనున్నాయి. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.31,260, స్టాండర్డ్లో రూ.23,875, ఎకానమీ క్లాస్లో రూ.15,075గా నిర్ణయించారు. ఐదు నుంచి 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.14,070, రూ.22,695, రూ.29,845గా నిర్ణయించారు. ఈ రైల్లో మొత్తం 700 సీట్లు అందుబాటులో ఉండగా 460 స్లీపర్ బెర్తులు, 192 థర్డ్ ఏసీ బెర్త్లు, 48 సెకండ్ ఏసీ బెర్త్లు ఉంటాయి. ఇక పుణ్యక్షేత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుందని, ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావు. పూర్తి వివరాల కోసం ఐఆర్సిటిసి వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.

ప్రయాణం ఇలా..
మొదటి రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగనున్నది. రెండో రోజు ఉదయం 09:35 గంటలకు పూరీకి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అయిన తర్వాత, పూరీ జగన్నాథ ఆలయం సందర్శనకు వెళ్లాలి. తర్వాత హోటల్కి తిరిగి వెళ్తారు. డిన్నర్ తర్వాత రాత్రి పూరీలో బస ఉంటుంది. మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి వెళ్లిపోవాలి.

అక్కడి నుండి కోణార్క్ సూర్యదేవాలయం , ఒడిషా బీచ్ను చుట్టేయొచ్చు. తర్వాత మాల్తీపాట్పూర్ రైల్వే స్టేషన్ నుంచి గయకు మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయకు చేరుకుంటారు. ఉదయం టిఫిన్ అనంతరం గయలోని విష్ణుపాద దేవాలయాన్నిసందర్శించి వారణాసి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఐదో రోజు ఉదయం ఆరు గంటలకు వారణాసి చేరుకుంటారు. టిఫిన్ అనంతరం కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవీ వంటి ఆలయాలను సందర్శిస్తాము. సాయంత్రం గంగా హారతిని వీక్షించి రాత్రి అయోధ్యకు ప్రయాణమవుతారు.
ఆరో రోజు అయోధ్య చేరుకుంటారు. శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఏడోరోజు ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. టిఫిన్ అనంతరం అక్కడ త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన మండపాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమవుతారు. ఎనిమిదో రోజు తిరుగు ప్రయాణంలో విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు భారత్ గౌరవ్ రైలు చేరుకుంటుంది. తొమ్మిదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల గుండా ప్రయాణించి రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.



Click it and Unblock the Notifications














