వారణాసిలో గంగానది ప్రవాహం ఉధృతంగా పెరిగింది. నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కాశీ వ్యాప్తంగా పోలీసులు, అధికారులు భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా నదిలో పడవల విహారాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఉధృతికి ప్రధాన ఘాట్ల వద్ద ఉన్న కింది మెట్లు నీట మునిగాయి. ప్రమాదకరమైన తీర ప్రాంతాల వద్దకు జనం వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి వచ్చే భక్తులు తమ పర్యటనలో పడవల ప్రయాణాన్ని మినహాయించి, భూమార్గంలో వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్లో సాయంత్రం వేళ నిర్వహించే గంగా హారతి ప్రదేశాన్ని ఎత్తైన ప్లాట్ఫారమ్పైకి మార్చారు. పడవలపై నుంచి హారతి చూడటంపై నిషేధం విధించడంతో, భక్తుల కోసం ఒడ్డునే ప్రత్యేక ప్రాంతాలను కేటాయించారు. ప్రమాదాలు జరగకుండా భక్తులు నదికి దూరంగా ఉండేలా ఈ స్థలాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:45 నుంచి రాత్రి 7:45 గంటల మధ్య విపరీతమైన రద్దీ ఉంటుందని, ఆ సమయంలో రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హారతిని తిలకించాలనుకునేవారు కాస్త ముందుగానే ఘాట్కు చేరుకోవడం శ్రేయస్కరం.

కాశీ విశ్వనాథుని దర్శన మార్గాలు.. పాటించాల్సిన నియమాలు
కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే భక్తులు కేవలం భూమార్గంలోని కారిడార్ గేట్ల ద్వారా మాత్రమే ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మెట్లు జారేలా ఉండటం, నదీ జలాలు చొచ్చుకురావడంతో ఘాట్ల వైపు నుంచి ఉండే దారులను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఆలయంలో దర్శనానికి 45 నుంచి 90 నిమిషాల వరకు సమయం పడుతోంది. భద్రతా తనిఖీల కోసం భక్తులు తమ అసలు (Original) ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. తనిఖీల వద్ద ఆలస్యం కాకుండా ఉండాలంటే ప్రధాన ద్వారాల వద్ద ఉండే అధికారిక లాకర్లలోనే తమ వస్తువులను భద్రపరుచుకోవడం మంచిది.
వారణాసి ప్రయాణంలో వహించాల్సిన జాగ్రత్తలు.. హోటళ్ల సమాచారం
ఘాట్ల వైపు వెళ్లే రహదారుల్లో రద్దీని తగ్గించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వాహనాల్లో వచ్చేవారు గొడోలియా (Godowlia) పాయింట్ వరకు మాత్రమే వచ్చి, అక్కడి నుంచి ఆలయానికి ఎలక్ట్రిక్ రిక్షాల్లో లేదా కాలినడకన వెళ్లాలని ట్రావెల్ ప్లానర్లు సూచిస్తున్నారు. మెట్లు తడిగా ఉండి జారే అవకాశం ఉన్నందున, పర్యాటకులకు సహాయంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు నిరంతరం ఘాట్ల వద్ద పహారా కాస్తున్నాయి. భక్తులు ఘాట్లపై నడిచేటప్పుడు అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి.
నదిలో ఆకస్మికంగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున, నగరంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో బస చేయడం సురక్షితం. కంటోన్మెంట్, సిగ్రా, లంక వంటి ప్రాంతాల్లోని హోటళ్లలో నాణ్యమైన జనరేటర్ బ్యాకప్ వసతులు అందుబాటులో ఉంటాయి. భక్తులు తమ హోటల్ బుకింగ్స్ను ఫ్లెక్సిబుల్, రిఫండబుల్ ఆప్షన్లతోనే చేసుకోవడం శ్రేయస్కరం. తిరుగు ప్రయాణంలో రైళ్లు మిస్ కాకుండా ఉండేందుకు కనీసం 30 నుంచి 60 నిమిషాల అదనపు సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక ప్రయాణం ప్రారంభించే ముందు భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసే అధికారిక తాజా సమాచారాన్ని ఒకసారి సరిచూసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications











