తెలంగాణా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు (మార్చి 27) నుండి శివ కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 31 వరకు జరగనున్నాయి. కళ్యాణోత్సవాల ఘనంగా నిర్వహించటం కోసం ఇప్పటికే ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఐదు రోజులపాటు శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. అయిదు రోజుల పాటు నిర్వహించే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఇప్పటికే ఆలయం లోపలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరణ చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. ఈ శివ కళ్యాణోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనావేస్తున్నారు. అలాగే, వేసవి కావటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున చలువ పందిళ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. శివ కళ్యాణోత్సవాలలో తొలిరోజు ఉదయం 8.05 గంటలకు ఉత్సవాలు ప్రారంభించి, పుణ్యాహవాచనం వేడుకగా నిర్వహించారు.

శివ మహాపురాణ ప్రవచనం..
ఈ రోజు సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహించనున్నారు. రాత్రి భేరీ పూజ దేవతాహ్వాన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉండనున్నాయి. అలాగే, రేపు (మార్చి 28న) ఉదయం 10.50 నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహిస్తారు. మార్చి 29వ తేదీన తీర్థ రాజస్వామి పూజ ఆవాహిత దేవతార్చన, బలిహరణం, ఔపాసనం, కళ్యాణ మండపంలో రాత్రి సదస్యం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి.
ఏకాంత సేవతో ఉత్సవాల ముగింపు..
30న సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 31న పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుం డంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణములు నిర్వహించి ఆపై ఏకాంత సేవతో ఉత్సవాలను ముగించనున్నారు. వేములవాడకు ఈ వేడుకలను తిలకించటానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని ఆలయాలు ఉన్నాయి..
వేములవాడలో కేవలం రాజరాజేశ్వర ఆలయమే కాకుండా మరిన్ని ఆలయాలున్నాయి. వాటిలో రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్దిని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, బద్దీపోచమ్మ, భీమేశ్వరాలయం ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్ నుంచి వేములవాడ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. సిద్ధిపేట, సిరిసిల్ల మీదుగా టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. ప్రతి 30 నిమిషాలకొక బస్సు ఉంది. అలాగే శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్.. అక్కడ నుంచి వేములవాడకు చేరుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు కుటుంబసమేతంగా ఇప్పుడే బయలుదేరండి!



Click it and Unblock the Notifications












