ప్రకృతి ప్రేమికులు ఈ సీజన్లో సందర్శించాలనుకునేవారికి తెలంగాణలోనే సుందరమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వేలాడే వంతెన. చెరువుకు ఆనుకుని రెస్టారెంట్లు, ఇతర వసతి సౌకర్యాలు అన్నీ కలగలిసిన ప్రకృతి అందాలు రాష్ట్రంలోని లక్నవరంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన పర్యాటక క్షేత్రాలలో లక్నవరం సరస్సు ఒకటి. ఇది ములుగు జిల్లాలో వెలసింది.
ఈ సరస్సు వరంగల్ సిటీ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు, వేలాడే వంతెన దాని కింద నీళ్లు..ఈ ప్రదేశం పర్యాటకులకు వింతైన అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల మధ్య వెలసిన అతిపెద్ద చెరువే లక్నవరం సరస్సు. ఇది కోనసీమ, అరకు, కేరళ తలపించే విధంగా ఉంటుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది.
లక్నవరం సరస్సును సందర్శించాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ సరస్సు 13వ శతాబ్దంలో అప్పటి కాకతీయ రాజులు సాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసింది.

దీని నిర్మాణం కోసం కృషి చేసిన అప్పటి సైన్యాధిపతి భార్య లక్కవతి పేరు మీద లక్నవరం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. తెలంగాణ అందిస్తోన్న ఈ ప్యాకేజీలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించేయొచ్చు. 'కాకతీయ హెరిటేజ్' పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం రెండు రోజుల పాటు టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరంతో పాటు యాదాద్రిలను కూడా సందర్శించేయొచ్చు.
ప్యాకేజీ వివరాలు..
ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఏసీ మినీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14వ తేదీన సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్రయాణం చేయొచ్చు. ఈ తేదీలను తెలంగాణ టూరిజం శాఖ ప్రకటిస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవాలనుకునేవారు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్ను https://tourism.telangana.gov.in/ సంప్రదించగలరు.

రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటిరోజు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. 8:30గంటలకు భువనగిరి ఫోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ టిఫిన్ చేసి ఉదయం 9:45 AM గంటలకు యాదాద్రి దర్శనం చేసుకుంటారు. ఉదయం 11:30 గంటలకు జైన్ ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు పెంబర్తిలో షాపింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1:30 PMకు వరంగల్ హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటారు.
కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వేయి స్తంభాల ఆలయ సందర్శనకు బయలుదేరుతారు. అనంతరం వరంగల్ ఫోర్టులోని లైట్ ప్రదర్శనను వీక్షిస్తారు. ఆ నైటంతా వరంగల్ లోనే బస చేస్తారు. మరుసటిరోజు (ఆదివారం) రామప్ప దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు లక్నవరం వెళ్తారు. అనంతరం లక్నవరం బోటింగ్ ఉంటుంది. ఆ తర్వాత హన్మకొండలోని హరిత హోటల్ ప్రయాణం. సాయంత్రం టీ బ్రేక్ ఉంటుంది. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలివే..
ఈ టూర్ ప్యాకేజీ ధరలను చూస్తే పెద్దలకు రూ. 3449 గా ఉంటుంది. అదే, చిన్నారులకయితే రూ. 2759గా నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో దర్శనంతో పాటు హోటల్ సౌకర్యం కూడా కల్పిస్తారు.



Click it and Unblock the Notifications













