గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తెలంగాణలోని ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని రోడ్లన్నీ చెరువులని తలపిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు పర్యాటక కేంద్రాలపై అధికారులు ఆంక్షలు విధించారు. పూర్తిగా వానలు తగ్గేంత వరకూ ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ ప్రదేశాలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రండి ఆ పర్యాటక ప్రదేశాలేంటో చూసేద్దాం..
ఉమ్మడి వరంగల్ జిల్లా..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఏరులూ ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ భారీ వర్షాల ప్రభావం తెలంగాణ టూరిజంపై కూడా పడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వాజేడు జలపాతం ఈ వర్షాలకు పొంగిపొర్లుతుంది. అయితే, ఈ సమయంలో ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఎవ్వరూ రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు తగ్గేంతవరకు ప్రజలకు వారికి సహకరించాలని అధికారులు కోరారు.

ములుగు జిల్లాలోని జలపాతాలు..
రాష్ట్రంలోని ములుగు జిల్లా కూడా వర్షాలతో ఏరులైపారుతుంది. దీంతో పలు చోట్లు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ జిల్లా కలెక్టర్ ఇక్కడి పర్యాటకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేంత వరకు పర్యాటకులు ములుగు జిల్లాలో ప్రసిద్ధిచెందిన బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క- సారలమ్మ దేవాలయాల సందర్శన రావొద్దని హెచ్చరించారు.
ఈ సమయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. స్థానికులు, ఇతర జిల్లాల సందర్శకులు సహకరించాలని కోరారు. ఈ భారీ వర్షాలకు జిల్లాలోని జలపాతాలు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శించకుండా ఉంటే మంచిదని వారు కోరారు. వర్షాలు తగ్గాక వారి పర్యటనలను ప్రారంభించొచ్చని తెలిపారు.

పలు కార్యక్రమాలపై నిషేదం...
ప్రజల రక్షణ కోసమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ములుగు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటువంటి ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ ఉంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు కూడా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేపల వేటపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించారు. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టడాన్ని కూడా అధికారులు నిషేధించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

ఉదృతంగా ప్రవహిస్తున్న నదులు..
వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద కూడా అధికారులు ఆంక్షలు విధించారు. పాకాల మత్తడి పోస్తున్న కారణంగా అక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా, భారీ వర్షాలకు నర్సంపేట నుంచి పాకాల వెళ్లే దారిలో అశోక్ నగర్ దాటిన తర్వాత వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అటువైపుగా ప్రయాణించేవారు కాస్త జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
కొత్తగూడెం, గుంజేడు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. జిల్లాలోని నర్సంపేట మండలం మాధన్నపేట చెరువు కూడా మత్తడి పోస్తోంది. దీంతో మాధన్నపేట వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో సందర్శనకు వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే మత్తడి వద్దకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతోపాటు వాగు ఉప్పొంగడంతో నర్సంపేట- మాధన్నపేట, నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటుగా వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications













