పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, వాటి మధ్య కంటికి కనిపించడకుండా చెవులకు మాత్రమే వినిపించే గుప్త గోదావరి, కొండల నడుమ సప్త స్వరాలతో కచేరి చేస్తున్నట్లు పారే మందానికి నది ఇలా ప్రకృతి సౌదర్యం ఒక వైపు చిత్రకూటం సొంతం. అదే విధంగా తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆ పరమపావనుడైన శ్రీరామ చంద్రుడు, తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం సమయంలో మొదట ఇక్కడే కొంతకాలం ఉన్నాడు. దీంతో ఆ పరమ పావనుడైన శ్రీరామచంద్రుడి పాదధూళిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ చిత్రకూటం మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. ఇక్కడ చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఐదు ప్రాంతాల గురించిన క్లుప్తవివరణ మీ కోసం.
రామ్ ఘాట్
P.C: You Tube
మందాకినీ నది ఒడ్డున ఉన్న ఘాట్ ఒడ్డునే శ్రీరాముడు ప్రతి రోజూ స్నానం చేసేవాడని చెబుతారు. రామలక్ష్మణులు స్నానం చేసే సన్నివేశాలను తులసీదాస్ తన మనోనేత్రాలతో దర్శించాడని చెబుతారు. ఈ వివరాలన్నింటినీ తులసీ దాస్ తన రామచరిత మానస్ లో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. దీనికి కొద్ది దూరంలోనే సీతాదేవి స్నానం చేసే జానకి కుండ్ ను కూడా దర్శించుకోవచ్చు.
భరత్ మిలాప్
P.C: You Tube
తన అన్నగారు చిత్రకూట్ లో ఉన్నారని తెలుసుకొన్న భరతుడు వేలాది మంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చి ఇదే ప్రదేశంలో రాముడిని కలిసాడు. రాముడు తన వనవాస దీక్షను వదలనని చెప్పడంతో ఆయన పాదుకలను తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన గావిస్తాడు. అందుకు గుర్తుగా భరతుడికి చిన్న గుడిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
హనుమాన్ ధార్
P.C: You Tube
చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల మీటర్ల ఎత్తులో హనుమాన్ ధార ఉంటుంది. దాదాపు రెండువేల మెట్లను ఎక్కితే ఇక్కడ మనకు ఒక పెద్ద హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని నిత్యం ఒక నీటి ధార అభిషేకిస్తూ ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యం. ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు.
రామశయ్య
P.C: You Tube
సీతారాములు శయనించడానికి వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతి ప్రదేశాన్ని ఒక మంచంలా వాడుకొన్నారు. దీనినే రామశయ్య అని అంటారు. ఇక సీతారాములు కుర్చొన్న ఇక శిల పై ఇప్పటికీ వారి పాదముద్రలు మెరుస్తూ కనిపిస్తాయి. ఆ మెరుపునకు కారణం తెలియడం లేదు.
ఉత్సవాలు
P.C: You Tube
చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున జరిగే దీపోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మంత్రిత్వ శాఖలు విడివిడిగా అందుబాటు ధరలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవి కాక ప్రైవేటు బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఇక్కడకు 500 కిలోమీటర్లు.