పర్యాటక రంగంలో జలపాతాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జలపాతాలు పర్యాటకులని మంత్ర ముగ్దులను చేస్తాయి. ఎక్కడో పుట్టి పై నుంచి కిందకు పడుతుంటే ఆ నీటి శబ్దం.. అహా! చెప్పడానికి, చూడటానికి నోరు కదలదు, కళ్ళు రెప్పమూయవు. అంతగా అవి పర్యాటక రంగంలో పెనవేసుకున్నాయి. కాని అవి మన రాష్ట్రంలో తక్కువగా ఉండి పర్యాటకంలో జలపాతాల లోటు ఉంది అనుకుంటున్నాం ... కానీ బాగా తెలుసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే... అదీ ఒక్క మండలంలోనే మూడు జలపాతాలున్నాయని తెలిస్తే ఒకింత ఆశ్చర్యం కలగాక మానదు. ఇవన్నీ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ రామాయణ కాలపు నేపథ్యగానాలున్నాయి.
గౌరీ గుండం
పచ్చని అడవులతో కళకళలాడుతూ, కొండలకు దగ్గరవుతున్నకొద్దీ ఆ పచ్చని కొండల మధ్యనున్న నల్లని లోయ లోయలోకి దుముకుతూ కనిపించే తెల్లని జలపాతం గౌరీ గుండం. సుమారు 150 అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్ర మధ్య భాగం నుండి...అంటే సుమారు 70 అడుగుల ఎత్తు నుండి ‘సుయ్' మని సూటిగా నింగి నుండి నేలకు డుబుక్కు మని దుముకుతున్న సుందర దృశ్యం గౌరీ గుండం జలపాతం సొంతం. పైగా ఆ గుండం ఎనిమిది అడుగుల కన్నా ఎక్కువ లోతు ఉండదు కనుక ఆ గుండంలో దిగి స్నానాలు చేయవచ్చు, ఈతలు కొట్టవచ్చు. ఈ గుండం పెద్దపల్లి కి 10 కి. మీ. దూరంలో, సబ్బితం గ్రామంకి చేరువలో ఉన్నది.
Photo Courtesy: telangana tourism
దారి
ఇక ఓపికున్నవారు ఈ జలపాతానికి దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సీతమ్మ కొల్లుగుంట' అనే గుండాన్ని, ఉత్తరాన ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ‘పులిగుండం' అనే గుండాన్ని కూడా చూడవచ్చు. వాటి ప్రాకృతిక సౌందర్యాన్ని చూసి వాటి వద్దకు నడిచిన శ్రమను మరచిపోతాం.
Photo Courtesy: Telanganatourism
రాముని గుండాలు
రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపైనున్న ‘రామగుండం' అనే చెరువు. వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్ వరకు) సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి తిరుగుతూ ... తిరుగుతూ.. కిందకు దూకుతుంది. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం (గుండం)లోంచి బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గుండాల్లో నిలబడి జలపాతాల కింద జలకాలాడడం మధురానుభూతినిస్తుంది.
Photo Courtesy: Telanganatourism
యామ కోనం
గుండాల ఒడ్డు మీద కూర్చుని గుండంలోకి కాళ్ళు జారవిడిచి ఆ నీళ్ళల్లో ‘చలక్ చలక్' మని కొట్టడం.. నడవడం... ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకోవడం... ఈ చిలిపి చిన్నారి పనులన్నీ పెద్దలకు కూడా ఇక్కడ సాధ్యమే. గుండాల్లో నుంచి పారుతున్న నీళ్ళన్నీ ఇరుకైన రాతి లోయలో నుంచి తూర్పు వైపున కుంటలోకి చేరుతుంటాయ్. రెండు గుట్టల పదాల మధ్య ఆ కుంట చాలా అందంగా కనిపిస్తుంది. అందాన్ని మరింత ఆస్వాదించాలంటే ప్రస్తుతానికైతే కొండ పైనున్న ఈ గుండం వరకు ఒక కిలోమీటరు దూరం వరకు ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు.
Photo Courtesy: Telanganatourism
పరిసరాలు
రాముని గుండాల వైపు వెళ్తున్నప్పుడు గుట్ట కింద ఒక వీరగల్ విగ్రహ ముంది. ఈ వీరగల్ విగ్రహం దాటి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆరు అడుగుల ఎతైన ఏకశిలా వినాయక విగ్రహ ముంది. ఆ విగ్రహ శైలీ విశేషాలను బట్టి అది కనీసం వేయి సంవత్సరాలకు ముందటిదని అర్థమువుతుంది. కొండ శిఖరాగ్ర భాగాన ఒక అందమైన శిలా మండపం ఉంది. ఇక్కడి గుండాల్లో రాముడు సీత ఆనందించారనడానికి నిదర్శనంగా ఇక్కడ రాముడు -సీత ఆలింగన శిల్పాలు అరఫీటు ఎత్తుతో కన్పిస్తున్నాయి. రామాలయం పక్కన రామానుజస్వామి విగ్రహముంది. దాని పక్కన ఒక గుహాలయముంది.
Photo Courtesy: Telanganatourism
రాముని పాదముద్రలు
ఇక్కడ సీతారాములు తిరుగాడినట్టు వారి పాదముద్రలు కనిపిస్తుంటాయి. ఇంకా వేంకటేశ్వరస్వామి .. సంతోషిమాత .. గాయత్రీమాత మందిరాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే, మనసుకి ఉల్లాసం కలుగుతుంది ... ఆధ్యాత్మిక పరమైన ఉత్సాహం కలుగుతుంది. కొండపై నుండి గుండాల్లోకి పారే జలపాతాలు, లోయలు, యమకోణం, సీతమ్మ కొలను, చెక్డ్యాలంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో పారిశ్రామిక ప్రాంతవాసులకు ఈ స్థలం సందర్శనీయమైనది. అంతేకాకుండా కొండ కింద జెన్కో పంప్ హౌస్ లు ఉండడంతో ఇది విద్యార్థులకు, కుటుంబసభ్యులతో వచ్చేవారికి పిక్నిక్ స్పాట్గా మారింది.
Photo Courtesy: Telanganatourism
ఎలా వెళ్ళాలి??
వాయు మార్గం కరీంనగర్ లో ఎటువంటి ఏర్పోర్ట్ లేదు. దీనికి దగ్గరలో ఉన్నది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి సుమారుగా 160 కి. మీ. దూరంలో కరీంనగర్ ఉంది. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రైలు మార్గం కరీంనగర్ లో రైల్వే స్టేషన్ ఉంది. కనుక రైలు ప్రయాణం ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ కి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. రోడ్డు మార్గం కరీంనగర్ కి మంచి రోడ్డు సదుపాయమె కలదు. కనుక హైదరాబాద్, విజయవాడ మొదలగు ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు ఇక్కడికి నడుపుతుంటారు. హైదరాబాద్ నుంచి 160 కి. మీ. దూరంలో, విజయవాడ నుంచి 350 కి. మీ. దూరంలో ఈ ప్రాంతం ఉన్నది. రోడ్డు మార్గం ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి??
మొదటి మూడు గుండాలు హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సబ్బితం మీదుగా ప్రయాణిస్తే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన గౌరీ గుండం సులువుగా చేరుకొని ఆనందించడానికి అనువుగా ఉంది. ఇక రాముని గుండాల హైదరాబాదు నుండి పెద్దపల్లి, రామగుండం బి-పవర్హౌజ్ గడ్డ మీదుగా ప్రయాణిస్తే 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వేళ మీరు రాముని గుండాలకి మాత్రమే వెళ్ళాలానుకుంటే మాత్రం రామగుండం బి-పవర్హౌస్ మూలమలుపు వద్ద బస్సు దిగాలి. అక్కడ నుండి రాముని గుండాలు 2 కి మీ దూరంలో ఉంటాయి. కొండ దిగువ వరకు రోడ్డు సౌకర్యముంది. బి-పవర్హౌస్ మూల మలుపు నుండి లేదా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ చేరుకుని ఆటోలో ఆబాదిరామగుండం-లింగాపూర్ రోడ్డు మార్గం ద్వారా హౌసింగ్బోర్డు కాలనీ వరకు చేరుకోవాలి. అక్కడి నుండి కొండ మీదికి కాలినడకన వెళ్లాలి.
Photo Courtesy: Telanganatourism